KTR | కామారెడ్డి : నేను అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లో రాలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి లాగా తాను రాంగ్ రూట్లో రాలేదని, బరాబర్ తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డను అని కేటీఆర్ తేల్చిచెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రాహుల్ గాంధీ అమ్మ, అయ్య పేరు చెప్పుకోని బతుకుతుండు. అంత ఎందుకు నీ పక్కన ఉన్న శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ వాళ్ల అయ్యల పేర్లు చెప్పుకొని వచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ల అన్న పేరు.. భట్టి విక్రమార్క వాళ్ల అన్న మల్లు అనంత రాములు పేరు చెప్పుకుని వచ్చారు. దొంగల మధ్య ఉన్న నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదన్నారు కేటీఆర్.
మా అయ్య పేరు కేసీఆర్.. బరాబర్ ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డను నేను. మీలాగా వాళ్ల, వీళ్ల బూట్లు నాకి, సంచులు మోసి రాలేదు.. ఒక్కసారి కాదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నీలాగా రాంగ్ రూట్లో రాలేదు. చవుట పనులు చేసి, పార్టీలు మారి దిక్కుమాలిన పనులు చేసి రాలేదు. చేతగాని వాడినైతే మళ్లా నేను సిరిసిల్లలో గెలుస్తానా..? ఐదుసార్లు గెలిపించారు. కారు కూతలు, రోత మాటలు వద్దు.. ముఖ్యమంత్రిలాగా మాట్లాడు అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు.
మొన్నటి ఎన్నికల్లో కామారెడ్డి ఫలితం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. దాన్ని గురించి చర్చ, రాద్ధాంతం వద్దు. గతం గతః భవిష్యత్పై ముందు చూపు ఉండాలి. కామారెడ్డి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అందరికీ అందుబాటులో ఉన్న గంప గోవర్ధన్ మీకు అండగా ఉన్నారు. రేపటి రోజున గంప గోవర్ధన్ నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందుకు పోతామని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణలో మళ్లీ పూర్వ వైభవం వస్తది.. మంచి రోజులు వస్తాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి అర్ధరాత్రి బాయికాడికి పోయే రోజులు వచ్చాయని రైతులు అంటున్నారు. పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. గందరగోళం ఉంది. బతుకు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందని రైతులు అంటున్నారు. ప్రతి పంటకు రైతుబంధు పడుతుండే.. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతుబంధు రాలేదు.. మోటార్లు కూడా కాలుతున్నాయి.. రిపేర్లకు 2 లక్షలు ఖర్చు పెట్టామని రైతులు చెబుతున్నారు. తినే పల్లెంలో మట్టి పోసుకుంటిమి అని అందరూ అనుకుంటున్నారు అని కేటీఆర్ తెలిపారు.
మొన్న ఎన్నికల్లో ఎదురైన దెబ్బను పక్కకు పెట్టి.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కామారెడ్డిలో తిరిగి మన జైత్రయాత్ర మొదలు పెట్టాలని కోరుతున్నాను. రకరకాల ప్రచారాలు చేసి, ఇష్టమొచ్చినట్లు నోటికొచ్చిన హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బాల్కొండ, బాన్సువాడలో గెలిచాం. బోధన్, జుక్కల్, కామారెడ్డిలో స్వల్ప తేడాతో ఓడిపోయాం. చిన్నచిన్న పొరపాట్లు, పట్టింపుల వల్ల కొంత నష్టం జరిగిన మాట వాస్తవం అని కేటీఆర్ తెలిపారు.