KTR | రాష్ట్రంలో ఎరువుల కొరత నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతు భరోసా లేదు.. రైతు రుణమాఫీ లేదు.. కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూడా కరువొచ్చిందని అన్నారు.
మీరు అడిగినట్టు ఆధార్ కార్డులు ఇచ్చినా, రైతుకి కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎందుకుందని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఎందుకుందో రైతులకు వివరించాలని డిమాండ్ చేశారు. ₹266.50 ఉండాల్సిన బస్తా యూరియా ధర ఇప్పుడు ₹325 ఎలా అయ్యిందో రైతులకే కాదు రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలియాలన్నారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాను దగ్గరుండి నడిపిస్తుంది ఎవరని ప్రశ్నించారు. ఈ కృత్రిమ కొరత ఎవరి వల్ల ఏర్పడుతుందో, ఆఖరికి ఎరువులను కూడా బుక్కేస్తున్న మేతన్నలు ఎవరో వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.