KTR | సీఎం అంటే ఇప్పుడు కటింగ్ మాస్టర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. పర్రె మేడిగడ్డకు పడలేదు.. రేవంత్ పుర్రెకు పడ్డదని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెస్సే ఏదో దొంగచాటుగా చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతోంది.. కాబట్టి ప్రేక్షకపాత్రకు పరిమితం కావదవ్దని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. కేసులకైనా భయపడకండి అని.. చిట్టినాయుడు ఏం పీకలేడని ఎద్దేవా చేశారు. చిల్లర మల్లర రాతలు రాయించేవారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. బాక్సింగ్లో కిందపడ్డా నిలబడి కొట్లాడేటోడే వీరుడు అని చెప్పారు. కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీలు అయ్యారని కానీ కేంద్రం నుంచి వచ్చింది మాత్రం గుండు సున్నా అని విమర్శించారు.
చిన్న చిన్న తప్పిదాలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఒక రోజు దేశంలో చక్రం తిప్పే రోజు ముందుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి రూ.369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పజెప్పితే.. మనం దిగిపోయేనాడు రూ. 5 వేల 564 కోట్ల మిగులుతో కాంగ్రెస్కు అప్పజెప్పామని తెలిపారు. రెవెన్యూ మిగులు విషయంలో ముఖ్యమంత్రిదో మాట.. ఉప ముఖ్యమంత్రిదో మాట ఉందని విమర్శించారు.
పదేళ్లలో రూ. 4 లక్షల 17 వేల కోట్లు మనం అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఒక ఏడాదిలో రూ. 1 లక్షా 37 వేల కోట్ల అప్పు చేసిందని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్ల జరిగిన అభివృద్ధి గురించి మేం చెప్తాం.. మీ అప్పులతో ఏం జరిగిందో మీరు చెప్పగలరా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల పొట్ట కొట్టడం తప్ప ఏం చేసిందని ప్రశ్నించారు. పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నారని అన్నారు. ఢిల్లీకి తెలంగాణ ఏటీఎం అయిపోయిందని విమర్శించారు. కోటి ఆరు లక్షల మంది నుంచి దరఖాస్తులు తీసుకుని ఏం చేసినట్టు? మళ్ళీ ఈ రైతు ప్రమాణ పత్రాలెందుకు అని ప్రశ్నించారు.
ఆరు గ్యారంటీల గురించి ప్రశ్నిస్తుంటే.. తననను ఆరు కేసుల్లో ఎలా ఇరికిద్దామా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేటీఆర్ విమర్శించారు. కొడంగల్ భూములివ్వని కేసులో కూడా తనను ఇరికించే యత్నం చేశారని తెలిపారు. ఆయన కేసుల గురించి ఆలోచిస్తుంటే.. మనం రైతుల గురించి ఆలోచిద్దామని తెలిపారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించి, బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలు వేసుకుందామని తెలిపారు. రైతు భరోసాపై గ్రామాల్లో నాయకులంతా చర్చ పెట్టాలని సూచించారు.