KTR | ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. గురుకులాలను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేయడం పట్ల మండిపడ్డారు. గురుకులాల్లో మోగుతున్న విద్యార్థుల మరణమృదంగాన్ని ఆపడం చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చివరికి కనీస మానవత్వం కూడా లేదని తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ కాంగ్రెస్ సర్కారు వల్ల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో లాలిత్య చక్రం అనే మరో తొమ్మిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికరమని అన్నారు. .
కళ్ల ముందు విగతజీవిగా పడి ఉన్న బిడ్డ మృతదేహం చూసి గుండెలు పగిలిన తల్లిదండ్రులను ఓదార్చాల్సింది పోయి, పుట్టెడు దుఖంలో ఉన్న తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. రోజురోజుకూ ప్రజల దృష్టిలో దిగజారిపోవడమే కాకుండా, కనికరం కూడా లేకుండా పోయిన కాంగ్రెస్ సర్కారు తీరును చూసి విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని అననారు. ఈ దాష్టీకానికి విద్యాశాఖ మంత్రిగా విఫలమై, హోంమంత్రిగా కూడా అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. కేవలం 14 నెలల వ్యవధిలోనే ఒక రాష్ట్రంలోని గురుకులాల్లో 83 మంది విద్యార్థులు బలికావడం భారత దేశ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయని పేర్కొన్నారు.
రాక్షస రేవంత్ పాలనలో నేల రాలుతున్న పసి ప్రాణాలు 😥
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న లాలిత్య అనే బాలిక మృతి. బిడ్డ చనిపోయిందని అవేదన వ్యక్తం చేసిన తండ్రిని అదుపులోకి తీసుకుని మానవత్వం మరిచిన ప్రభుత్వం.
చనిపోయిన ఆ బిడ్డ… pic.twitter.com/vcaggqiF3n
— BRS Party (@BRSparty) March 10, 2025
ముఖ్యమంత్రి పూర్తి అసమర్థత వల్ల జరుగుతున్న ఈ వరుస మరణాలు ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారు చేసిన హత్యలే అని కేటీఆర్ అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై హత్యానేరం కింద కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. బాలిక మరణంపై తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నందున ఈ దారుణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు కనీసం మంచి భోజనం పెట్టడం కూడా చేతకాని ప్రభుత్వం చివరికి వారి ప్రాణాలను కూడా బలితీసుకోవడం సంక్షోభంలో కూరుకుపోయిన విద్యావ్యవస్థకు అద్దం పడుతోందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అర్థాంతరంగా రాలిపోతున్న ఈ విద్యాకుసుమాల పాపం ముఖ్యమంత్రికి తగలక మానదని అన్నారు. దయ లేని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు.