KTR | కాంగ్రెస్ సర్కారు పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలోనే కాదు.. చివరికి.. గ్రామ సచివాలయాల్లో కూడా పాలన పడకేసిందని విమర్శించారు. గాడితప్పిన పంచాయతీల్లో పరిపాలన సాగేదెట్లా..? సమస్యల సుడిగుండంలో ఉన్న ప్రజల కష్టాలు తీరేదెట్లా అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,789 పంచాయతీలు ఉండగా.. దాదాపు 80 శాతం సమస్యలతో సతమతమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక.. పల్లెల్లో పాలన పడకేసింది. ప్రత్యేకాధికారుల పాలనలో చాలా పంచాయతీలు నిర్వహణ లేక పారిశుద్ధ్యం, వీధి దీపాల మరమ్మతులకూ నిధుల కటకట ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిపైనే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం పడకేయడంతో ప్రజలు రోగాల పాలవుతున్నారని.. వీధి దీపాలు వెలగకపోవడంతో పల్లె సీమలను చిమ్మ చీకట్లు ఆవరించాయని అన్నారు.
దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయడానికి పైసల్లేవని.. పంచాయతీ ట్రాక్టర్కు డీజిల్ పోసే దిక్కులేదని కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాపాలనా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. ప్రత్యేకాధికారుల పాలనకు ఏడాదైనా కళ్లుతెరవరా అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో రూపురేఖలు మారాయని.. నాడు పంచాయతీలకు ఠంచన్ గా కడుపునిండా నిధులు వచ్చాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. మళ్లీ పల్లె ప్రజలకు పాత కష్టాలు తెచ్చిందని విమర్శించారు. నిన్నటి దాకా పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచ్ లు అప్పులపాలయ్యారని.. నేడు జేబుల నుంచి ఖర్చుచేసిన కార్యదర్శులకు తిప్పలు తప్పడం లేదని అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడాలని.. గ్రామాల్లో సమస్యల పంచాయితీని తీర్చాలని పిలుపునిచ్చారు.