KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రివా? ముఠా నాయకుడివా అని ధ్వజమెత్తారు. సీఎం గానే కాదు.. హోంమంత్రిగా కూడా ఉన్నావన్న సోయి కూడా లేకుండా బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను మరిచి, అసాంఘిక చర్యలను, నేరాలను ప్రోత్సహించేలా మాట్లాడటానికి కనీసం సిగ్గనిపించడం లేదా అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో పదేళ్లపాటు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో నేడు అరాచక పర్వానికి ద్వారాలు తెరిచే వారు రాజ్యమేలడం తెలంగాణకు పట్టిన దరిద్రమని విమర్శించారు. తెలంగాణ ప్రజల గుండెలనిండా గులాబీజెండాపై చెక్కుచెదరని అభిమానాన్ని చూసి ముఖ్యమంత్రి మైండ్ బ్లాక్ అయినట్టు స్పష్టమవుతోందని అన్నారు. రెండేళ్లలోనే అట్టర్ ఫ్లాప్ పాలనతో పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న మీకు పూర్తిగా మతిభ్రమించిందని ఇవాల్టి సభ సాక్షిగా తేలిపోయిందని అన్నారు.
సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే ఆగమేఘాల మీద కేసులు పెట్టి, అరెస్టులు చేసే పోలీసుశాఖ, రాష్ట్ర డీజీపీ గారు, ఇవాళ ముఖ్యమంత్రి చేసిన ఈ తీవ్రమైన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ పక్షాన కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి, తెలుగుదేశం పార్టీ పాట పాడటం వెనక ఉన్న అసలు కుట్ర కూడా తెలంగాణ సమాజానికి ఇవాళ అర్థమైపోయిందని అన్నారు. గత రెండేళ్లుగా పాత బాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టం చేసేలా జలహక్కులను కాలరాశారని ఇవాళ చేసిన ప్రకటనతో మీ నిజస్వరూపం బట్టబయలైందని తెలిపారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని స్పష్టమవడంతోనే దాని నుంచి ఏ క్షణానైనా బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా రుజవవుతోందని అన్నారు. బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొలేక ఓవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు తెలంగాణ ప్రజలు తరిమికొట్టిన టీడీపిని ఈ గడ్డపైకి తెచ్చే నీ పన్నాగాలను నాలుగు కోట్ల సమాజం తప్పకుండా తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. నీళ్ల నుంచి మొదలుకుని నిధులు, నియామకాల వరకూ తెలంగాణను పాతాళంలోకి నెట్టిన కోవర్టు రాజకీయాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి సీఎం రేవంత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.