KTR | హైదరాబాద్ : హస్తిన యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి అర్ధ శతకం సాధించారు.. 50 ట్రిప్స్.. జీరో రిజల్ట్స్ అని పేర్కొంటూ సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్తో కాకుండా… ఫ్లైట్ బుకింగ్స్తో రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారు. రేవంత్ ఢిల్లీ యాత్రలకు.. తెలంగాణకు ఏ సంబంధం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు ఇవే.. మొదటి పని – ఫ్లైటు టికెట్ బుక్ చేయడం! రెండో పని – ఢిల్లీకి పోవడం! మూడో పని – ఖాళీ చేతులతో తిరిగి రావడం! అని కేటీఆర్ పేర్కొన్నారు. రైతన్నలు ఇబ్బందులను తట్టుకుని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదు.. రైతులు పొలాల్లో జల్లడానికి యూరియా లేదు.. సాగునీళ్లు రావు.. తాగునీళ్లు లేవు.. కాళేశ్వరం ఎత్తిపోతల మరమ్మతు పనులు జరగకుండా అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నామన్న సోయి లేదు. బనకచర్ల నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన లేదు అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.
రెండు లక్షల ఉద్యోగాల ఊసు లేదు.. జాబ్ క్యాలెండర్ల జాడ లేదు. రుణమాఫీ కాలేదు – రైతు భరోసా రాలేదు. తులం బంగారం ఊసు లేదు.. రూ.4 వేల ఫించన్ జాడ లేదు. గురుకులాల గోడు పట్టదు – గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు వినపడడం లేదు. కానీ రేవంత్ రెడ్డి 3 రోజుల్లో 3 ఫ్లైట్లు ఎక్కుతున్నాడు.. దిగుతున్నాడు. “ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. 50 సార్లకు చేరిన హస్తిన యాత్ర. కానీ తెచ్చింది ఏమీ లేదు! శుష్కప్రియాలు.. శూన్య హస్తాలు. అయిననూ పోయి రావలె హస్తినకు అని పేర్కొంటూ రేవంత్పై కేటీఆర్ ధ్వజమెత్తారు.
కానీ ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేమిటి?? నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ.. దానికి బదులు దక్కింది మాత్రం… ఫోటో షూట్లు, వీడియోలు. విందు రాజకీయాలు! అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి. ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు! అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.