KTR | రుణమాఫీ పేరిట సీఎం రేవంత్ రెడ్డి మోసానికి తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రుణమాఫీ మొత్తం బోగస్ అని.. మిలియన్ డాలర్ల జోక్గా తేలిపోయిందని విమర్శించారు. అందుకే దాని నుంచి అటెన్షన్ డైవర్షన్ చేయడానికే ఈ రకమైన విన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఈ రుణమాఫీ.. స్వతంత్ర భారత దేశంలోనే రైతులకు జరిగిన అతిపెద్ద మోసమని కేటీఆర్ మండిపడ్డారు. ఒక దారుణమైన దగా, ఒక మాయ అని అన్నారు. రైతన్నలతో క్రూరమైన పరిహాసం ఆడిందని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. అడ్డగోలు ఆంక్షలు, అర్థం లేని షరతులు, కూతలు-కోతలతో రైతు రుణమాఫీ ఉందన్నారు. అన్నదాతలను కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిందని అన్నారు. అర్హులైన రైతుల్లో సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదని తెలిపారు.
రెండు లక్షల రుణమాఫీ కోసం 40వేల కోట్లు అవుతుందని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ముందు చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ఒక సంవత్సరం నేను కడుపుగట్టుకుంటే ఈ డబ్బును అనాయసంగా కట్టేయొచ్చని రేవంత్ చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఎన్నికలు అయిపోగానే మళ్లీ ఈ లెక్క మారింది.. 31వేల కోట్లతో రుణమాఫీ చేయాలని కేబినెట్ తీర్మానించిందని తెలంగాణ సీఎంవో జూలైలో ఒక ట్వీట్ చేసిందని తెలిపారు. రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ అర్హులే అని ఎన్నికల ముందు చెప్పారని.. ఇప్పుడు కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు.
రుణమాఫీ లెక్కలు చూస్తే.. ఉద్యోగికి రుణమాఫీ కట్.. పెన్షనర్కు కట్.. ఇన్కం ట్యాక్స్ కట్టేటోళ్లకు కట్.. రేషన్ కార్డు లేకుంటే కట్ చేశారని కేటీఆర్ అన్నారు. ఇవన్నీ ఎన్నికల ముందు చెప్పలేదని అన్నారు. సీఎం అంటే నిజానికి చీఫ్ మినిస్టర్.. కానీ ఇప్పుడు కటింగ్ మాస్టర్లా పరిస్థితి అయిపోయిందని ఎద్దేవా చేశారు. 60 శాతం మందికి ఎగ్గొట్టి.. కేవలం 40 శాతం మందికి చేసి.. 100 శాతం రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్న మొట్ట మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఇంతకుమించిన దగా, మోసం, రైతు ద్రోహం మరొకటి ఉండదని విమర్శించారు. సవాలక్ష కొర్రీలు, దిక్కుమాలిన ఆంక్షలతో మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను బ్యాంకులు, అధికారుల చుట్టూ పడిగాపులు గాచే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు.
అంకెలు మార్చి.. రంకెలు వేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. మార్పు మార్పు అని రైతులను ఏమార్చారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదటి మోసం.. లోక్సభ ఎన్నికలకు ముందు దేవుడి మీద ఒట్లు పెట్టి రెండో మోసం.. కేసీఆర్ మీద ద్వేషం.. సకలజనులకు మోసం.. అనేది ప్రభుత్వ పాలసీగా ఉందని అన్నారు. రెండు లక్షల రుణమాఫీ మోసం, రెండు లక్షల ఉద్యోగాలు మోసం.. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 మోసం, తులం బంగారం మోసం, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు మోసం, 4వేల నిరుద్యోగ భృతి మోసం, జాబ్ క్యాలెండర్ మోసం, దళితులకు 12లక్షలు ఇస్తామన్న మోసం, ఆటో అన్నలకు ఏడాదికి 12 వేలు మోసం, రైతు కూలీలకు నెలకు వెయ్యి మోసం, కౌలు రైతులకు రైతు భరోసా మోసం.. మొత్తంగా చూస్తే రుణమాఫీనే అతిపెద్ద మోసం అని విమర్శించారు.
రుణమాఫీకి ఎన్నికల ముందు చెప్పింది 40వేల కోట్లు, కేబినెట్ తీర్మానంలో చెప్పింది 31వేల కోట్లు, బడ్జెట్లో చెప్పింది 26వేల కోట్లు అని చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ ఆఖరకు నిన్నటివరకు జరిగిన రుణమాఫీ కేవలం 17,934 కోట్లు మాత్రమే అని తెలిపారు. 22,37,748 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్పారు. ఇన్ని కోతలు పెట్టి.. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి.. చిల్లర మాటలు, చిల్లర కూతలు అని విమర్శించారు. ఇందులో కూడా ఎన్ని వస్తాయో, ఎన్ని ఖాతాల్లో పడతాయో, దానికి సంబంధించి ఎన్ని కటింగ్లు ఉంటాయో తెలియదని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి దఫాలో ఒకటే టర్మ్లో 35 లక్షల మంది రైతులకు 17వేల కోట్ల రుణమాఫీ చేశామని కేటీఆర్ చెప్పారు. మొదటి టర్మ్లో లక్ష రూపాయల వరకే రుణమాఫీ చేస్తే.. 35 లక్షల మంది రైతులకు 17వేల కోట్ల రుణమాఫీ అయ్యిందని అన్నారు. ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీకి కూడా 17,934 కోట్లు అవుతుందని ప్రశ్నించారు. ఈ ఒక్క లెక్కతో కాంగ్రెస్ రుణమాఫీ ఎంత దగానో, ఎన్ని లక్షల మందిని ముంచారో అర్థమవుతుందని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేసి, రైతుబంధు కూడా వేశామని చెప్పారు. మొత్తంగా చూస్తే.. 72వేల కోట్ల రైతుబంధును అకౌంట్లలో డిపాజిట్ చేశామని తెలిపారు. అదే సమయంలో దాదాపు 30వేల కోట్లు రుణమాఫీ చేశామని అన్నారు. అంటే రైతులకు రుణమాఫీ, రైతుబంధు రూపంలో లక్ష కోట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. వానకాలానికి ఇవ్వాల్సిన రైతుభరోసా 11,400 కోట్లు ఎగ్గొట్టావ్ కదా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూలైలో రైతుబంధు పడేదని.. ఇవాళ రైతుబంధు పడిందా? అని అడిగారు. రైతుబంధు ఇచ్చే సూచన కూడా కనిపించడం లేదని అన్నారు.
మొన్న యాసంగిలో ఎకరానికి 7500 ఇవ్వలేదని.. అప్పుడు 4వేల కోట్లు ఎగ్గొట్టారని కేటీఆర్ విమర్శించారు. రైతుభరోసా కింద ఓవరాల్గా ఇవ్వాల్సిన 15వేల కోట్లలో అది ఇవ్వలేదు. రైతు రుణమాఫీ కింద 17వేలు ఇచ్చి ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ దగా, మోసం అని అన్నారు. రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసినవాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. పాత గోడకు కొత్త సున్నం వేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. నీ అడ్డమైన ఫీట్లు చూసి.. ఇన్ని రకాల మోసాలు చేయొచ్చా అని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్లు కూడా ఆగమవుతున్నారని అన్నారు.