KTR | కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. అసలు ఆయన ఏం మాట్లాడతడో.. ఎప్పుడు ఏం ఒర్రుతడో అర్థం కాదని ఆయన ఎద్దేవా చేశారు. చొక్కారావు, బద్దం ఎల్లారెడ్డి, కేసీఆర్ వంటి మహానుభావులు ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గంలో.. అడ్డిమారి గుడ్డిదెబ్బలో బండి సంజయ్ గెలిచారని విమర్శించారు. గురువారం నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీగా కరీంనగర్కు ఏం చేశావో చెప్పాలని బండి సంజయ్ను నిలదీశారు.
గత పదేండ్లలో ఐదేండ్లు వినోద్కుమార్ ఎంపీగా ఉన్నారని.. ఇంకో ఐదేండ్లు బండి సంజయ్ ఎంపీగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. ఢిల్లీలో మాత్రం ప్రధానిగా మోదీనే ఉన్నారని చెప్పారు. మరి ఈ పదేండ్లలో కరీంనగర్కు ఎవరు ఏం చేసిండ్రో బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్కు సవాలు విసిరారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున వినోద్కుమార్ చర్చకు వస్తారని తెలిపారు. డేట్ అండ్ టైమ్ నువ్వు ఫిక్స్ చేయ్.. ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్ అని అన్నారు. కరీంనగర్ కమాన్లనే నీ బతుకేందో తెలుసుకోవాలని మండిపడ్డారు. ఈ ఐదేండ్లలో కరీంనగర్లో సొల్లు వాగుడు, పిచ్చి ఒర్రుడు, కేసీఆర్ను తిట్టుడు తప్ప ఒక్క మంచి పనైనా చేశాడా? అని నిలదీశారు. ఒక్క గుడి తెచ్చినవా? ఒక్క బడి తెచ్చినవా? ఒక్క కాలేజీ తెచ్చినవా? ఒక్క పరిశ్రమ తెచ్చినవా? ఒక్క రోడ్డు తెచ్చినవా? ఒక్క రైలు తెచ్చినవా? మరి ఏం పీకేందుకు నువ్వు ఎంపీగా ఉండాలి? నీకెందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. మాట్లాడితే సొల్లు పురాణం, తెల్లారితే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుడు.. సైకో లెక్క ఒర్రుడు తప్ప.. నువ్వు చేసిందేంటి? అని నిలదీశారు. రమ్మంటే చెప్పు కమలాకర్ లేదా వినోద్ వచ్చి చూపిస్తరు. పదేండ్లలో బీఆర్ఎస్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది? ఎక్కడ ఏం చేసిందనేది చూపిస్తం అని అన్నారు. రోడ్లు ఏం కట్టినం? బిల్డింగ్లు ఏం కట్టినం? స్కూళ్లు ఏం కట్టినం? మెడికల్ కాలేజీలు ఏం కట్టినం? ఎక్కడ సస్పెన్షన్ బ్రిడ్జిలు కట్టినం, ఎక్కడ రివర్ ఫ్రంట్ కట్టినం.? ఎక్కడ గుడి కట్టినం? అనేది మేం తీసుకెళ్లి చూపిస్తం. నువ్వు చేసిన ఒక్క పని చెప్పు అని ప్రశ్నించారు. ఒక ఎంపీగా ప్రధాని మోదీనికి పట్టుకుని ఒక్క పనిచేసినా అని చెప్పే ముఖం ఉందా? నీకు ఎందుకు ఓటెయ్యాలని బండి సంజయ్ను నిలదీశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ సీరియస్ అయ్యారు. కేసీఆర్ ఒక్క మాట అంటే నానా రచ్చ చేసి.. ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి.. చిల్లర ప్రచారం అంతా చేసి.. గోల్మాల్ చేసి గెలిచిన ఎంపీవి అని మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీ తల్లికి నువ్వు పుట్టినవా అని చిల్లర మాటలు మాట్లాడే వాళ్లు ఎంపీగా పనికొస్తారా? అని ప్రశ్నించారు. ఇలంటి చిల్లర వ్యాఖ్యానాలు, రాజకీయ ప్రత్యర్థులపై నోరుపారేసుకోవడం.. ఇదేనా నీకు తెలిసిన నీతి? అని ప్రశ్నించారు. ఈ ఐదేండ్లలో కరీంనగర్కు ఏం పనిచేశావ్? సిరిసిల్ల నేతన్నలకు ఒక్క పనిచేసినవా? జమ్మికుంటలో నేత కార్మికుల కోసం ఒక్క పనిచేసినవా? కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉండే రైతులకు ఒక్క పనిచేసినవా? గిరిజనులు, దళితులు, మహిళలు ఏ ఒక్క వర్గానికి అయినా మంచి పనిచేసినవా? అని నిలదీశారు. ఆఖరకు నీకు ఇచ్చిన ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టే చాతకాదు.. నువ్వు ఎంపీగా ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు.
దేశం కోసం.. ధర్మం కోసం పనిచేస్తున్నా అని బండి సంజయ్ అంటారని కేటీఆర్ గుర్తుచేశారు. ధర్మం కోసం పనిచేసేటోడివి అయితే మఠం పెట్టుకో? ఎవరద్దన్నారని విమర్శించారు. మఠం పెట్టుకుని.. కాషాయం వేసుకుని.. బ్రహ్మాండంగా తిరుగు ఎవరద్దన్నారని అన్నారు. ఎంతోమంది స్వామీజీలు అన్ని పరిత్యజించి పనిచేస్తున్నారని చెప్పారు. బండి సంజయ్కు అలా వద్దంట.. ఎంపీ పదవి కావాలి.. అధికారం కావాలి.. అధికారం ద్వారా వచ్చే లాభాలు కావాలని విమర్శించారు. ధర్మం కోసం పనిచేస్తున్నా అని పోజులు కొట్టాలి.. ప్రజల కోసం మాత్రం పనిచేయవద్దు అనేదే బండి సంజయ్ నైజం అని తెలిపారు. అందుకే అన్నాదమ్ములు.. అక్కాచెల్లెళ్లు ఆలోచించాలని.. మన కోసం గర్జించే గొంతు మన వినోదన్నను గెలిపించుకునేందుకు అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సంవత్సరం మొత్తం ఎన్నికలే ఉంటాయని కేటీఆర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే పంచాయతీ.. పంచాయతీ అయిపోగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ ఎన్నికలు ఉంటాయని అన్నారు. ఆ ఎన్నికల్లో మీ అందర్నీ గెలిపించుకునే బాధ్యత తమదే అని బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అందరికీ మాట ఇస్తున్నా అని చెప్పారు. ఇవాళ మీరు ఎట్లయితే కాలికి బలపం కట్టుకుని తిరుగుతారో.. రేపు మీకోసం అంతకంటే ఎక్కువగా పనిచేసే బాధ్యత తమదని అన్నారు. మిమ్మల్ని గెలిపించుకునేందుకు ఊరూరా తిరిగే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు.