KTR | నాడు కేసీఆర్ పాలనలో పదేళ్లు వెలుగుల్లో బతికిన తెలంగాణాలో నేడు 11 నెలల కాంగ్రెస్ పాలనలో చీకట్లు అలుముకున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాడి పంటలు, పసిడి సంపదలతో కళకళలాడిన పల్లెలు నేడు పోలీసు బూట్ల చప్పుళ్లతో అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జేబునిండా డబ్బులతో రుబాబ్గా బతికిన రైతన్నను నేడు చేతికి బేడీలు వేసి ఠాణాల చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు.
నాడు అడగక ముందే రైతన్నల హక్కుగా భావించి కేసీఆర్ రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీళ్లు, పంటల కొనుగోళ్లు చేపట్టి రైతన్నకు వెన్నెముకగా నిలిస్తే .. నేడు హక్కుల కోసం జరుగుతున్న పోరులో రైతన్న ఆగమైతుండని కేటీఆర్ అన్నారు. నాడు కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయిన గ్రామాలు .. నేడు ఘడియ ఘడియ గండంగా కంటిమీద కునుకులేకుండా బతుకులీడుస్తున్నాయని తెలిపారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు ఒక్కొక్కటిగా అన్నీ కోల్పోతున్నారని పేర్కొన్నారు. రైతులు రైతుబంధు కోల్పోయారు.. రుణమాఫీ కోల్పోయారు సాగునీళ్లు కోల్పోయారు.. 24 గంటల ఉచిత కరంటు కోల్పోయారని చెప్పారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోళ్లు లేక తండ్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు.
ఆడబిడ్డలు కళ్యాణలక్ష్మి, తులం బంగారం కోల్పోయారని.. బాలింతలు అమ్మఒడి – కేసీఆర్ కిట్ కోల్పోయారని కేటీఆర్ తెలిపారు. గొల్ల, కురుమ సోదరులు సబ్సిడీ గొర్రెలు కోల్పోయారని.. దళిత సోదరులు దళితబంధు కోల్పోయారని పేర్కొన్నారు. మత్స్యకార్మిక సోదరులు ఉచిత చేప పిల్లలను కోల్పోయారని చెప్పారు. చేనేత కార్మికులు బతుకమ్మ, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా చీరల ఆర్డర్లు కోల్పోయి ఆర్థికంగా చితికిపోతున్నారని చెప్పారు. విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని కోల్పోయారని.. నిరుద్యోగులు కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటివెలుగు కతమయింది.. ఇంటివెలుగు మాయమయింది.. తెలంగాణ భవిష్యత్ చీకటయిందని అన్నారు. జాగో తెలంగాణ అని పిలుపునిచ్చారు.