KTR | వికారాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిపాలన తన చేతుల్లో లేదని రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా చిల్లరగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నిన్న రేవంత్ రెడ్డి తుక్కుగూడలో మీడియాతో మాట్లాడుతూ.. రూ. 2 లక్షల రుణమాఫీ అంశాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఇంకా సిగ్గు చేటు ఏంటంటే.. పరిపాలన నా చేతుల్లో లేదు.. ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని రేవంత్ అన్నడు. మరి ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు..? పరిపాలన అల్టిమేట్గా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటది. తాత్కాలికంగా రెండు నెలల పాటు ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎలక్షన్ కమిషన్ సమన్వయం చేస్తుంది. ఇది కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. పరిపాలన అనుభవం లేదు కదా..? ఎలా నడుపుతావు అంటే రేవంత్ ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి పదవి గుంపు మేస్త్రీ పదవి అని మాట్లాడిండు. ప్రధాన మంత్రేమో తాపీ మేస్త్రీ.. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టే పనిలో ఉన్నారు. మన తెలంగాణ పార్టీకి సమాధి కట్టాలని కలిసి పని చేస్తున్నాయని కేటీఆర్ తెలిపారు.
ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపోళ్లు కాంగ్రెస్కు సహకరించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీకి సహకరించే ప్రయత్నం చేస్తున్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని తెలుసుకుని నిన్న మొన్నటి దాకా ఇంచార్జిగా ఉన్న రేవంత్.. ఇప్పుడు తప్పుకున్నాడు. సీఎంగా ఉండి సీటు ఓడిపోతే పరువు పోతదని గ్రహించి జారుకున్నాడు. చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ తప్పకుండా గెలుస్తున్నాడు అని కేటీఆర్ పేర్కొన్నారు.
పార్టీ ఎందుకు మారవు అని సోషల్ మీడియాలో రంజిత్ రెడ్డిని పిల్లలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో ఓడినంత మాత్రానా పార్టీ నుంచి వెళ్లిపోతామా..? మన పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేవాడా..? అవకాశం, స్వార్థ్యం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అవకాశావాదిని ఓడగొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రంజిత్ రెడ్డి ఇంటికి వస్తే చాయ్ తాగించి ఓదార్చండి.. కానీ బరాబర్ ఓడగొడుతామని చెప్పండి.. మన పార్టీని ఖతం చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంటే.. రేవంత్ రెడ్డి దగ్గర కండువా కప్పించుకున్నాడు. రాజకీయ జీవితం ఇచ్చిన కేసీఆర్పై ఆయనకు ప్రేమ లేనప్పుడు.. మనం ఎందుకు ప్రేమ చూపించాలి. రంజిత్ రెడ్డి సెంటిమెంట్లకు పడిపోకండి.. దొంగల పార్టీలో కలిసిపోయావు.. అని చెప్పండి అని కేటీఆర్ సూచించారు.