KTR | హైదరాబాద్ : పంద్రాగస్టు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయిందని, తన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొని, జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో రాష్ట్రాలు కలిగి ఉన్న వైవిధ్య భారతానికి స్వాతంత్రం సిద్ధించి 79 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తరపున బీఆర్ఎస్ తరపున హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వేచ్చా, స్వాతంత్ర్యాల కోసం బలిపీఠం ఎక్కిన వేలాది మంది త్యాగధనులకు, ఆనాటి నాయకత్వానికి వినమ్ర పూర్వక శ్రద్ధాంజలి. 14 రాష్ట్రాలతో మొదలైన స్వతంత్ర భారతదేశ ప్రయాణం ఇవ్వాళ 28 రాష్ట్రాల వైవిధ్య భారతంగా విలసిల్లుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో మొత్తం భారతదేశానికే ఆదర్శంగా నిలిచింది. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పోరాటం జరిపి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అభివృద్ధి, సంక్షేమం, తలసరి ఆదాయం, వ్యవసాయ విస్తరణలో అద్భుత విజయాలను సాధించి.. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని కేసీఆర్ నాయకత్వం నిజం చేసింది. ఎక్కడో 14 స్థానంలో ఉన్న తెలంగాణ 10 ఏళ్లలోనే పంజాబ్, హర్యానాను వెనక్కి నెట్టి ధాన్యం ఉత్పత్తిలో అగ్రభాగాన చేరడానికి రైతును రాజునే చేయాలన్న కేసీఆర్ సంకల్పమే కారణం అని పేర్కొన్నారు.
ఐటీ రంగం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పల్లె ప్రగతి, పేద వారికి సంక్షేమ కార్యక్రమాలు ఇలా ఏ రంగం తీసుకున్న పదేళ్లలో భారత దేశానికే లైట్ హౌజ్లాగా తెలంగాణ నిలబడ్డది. 20 నెలల కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధ కలుగుతుంది. రైతులు రాజు చేయాలన్న కేసీఆర్ తపన పక్కకు వెళ్లిపోయింది. స్వాతంత్ర దినోత్సవం వేళ యూరియా కోసం రైతులు చాంతాడంత లైన్లలో చెప్పులు పెట్టి క్యూ కడుతున్నారు. మళ్ళీ ఆనాటి పాత కాంగ్రెస్ రోజులను రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. స్వాతంత్ర్యం అంటే సొంతంగా పరిపాలించుకోవడమే కాదు ఆత్మగౌరవంతో బతకడం. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల పాటు ఆత్మగౌరవంతోనే బతికాం. కానీ ఇవ్వాళ మళ్లీ ఢిల్లీ పాలన తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దపడిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది. ఢిల్లీ పార్టీల పెత్తనం తెలంగాణలో నడుస్తుంది. 51 సార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రి అప్ అండ్ డౌన్ చేశారు. ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన దుస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది. తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయింది. తన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోయింది. సంక్షేమంలో, వ్యవసాయంలో వెనుకబడ్డది. ఐటీ, పరిశ్రమలు తరలిపోతున్నాయి, దానికి ఢిల్లీ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కారణం. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పెద్దలు జయశంకర్ సార్ వేల సార్లు చెప్పారు. సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి. ఆత్మగౌరవంతో బతకాలి. పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలని జయశంకర్ సార్ చెప్పేవారు. ఇవన్నీ జరగాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్న మాటను మీ అందరికి గుర్తు చేస్తున్నాను. కులం, మతం లాంటి ఎన్నో అంశాలు మనల్ని విడదీయవచ్చు. కానీ మనందరినీ కలిపి ఉంచేది భారతీయత ఒక్కటే అని కేటీఆర్ పేర్కొన్నారు.