KTR | హైదరాబాద్ : అసెంబ్లీ సాక్షిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఒక్క పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా నిరనసలతో కదంతొక్కిన గులాబీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ కార్యక్రేత్రంలో మీరు చూపించిన సమరోత్సాహం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వానికి కూడా కొండంత స్ఫూర్తినిచ్చింది. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎలా ప్రాణాలకు తెగించి పోరాడారో, ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా కూడా తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంతకు రెట్టింపు తెగువతో మీరు పిడికిలి బిగించిన తీరు అభినందనీయం అని కేటీఆర్ కొనియాడారు.
బీఆర్ఎస్ శాసనసభ్యులు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సస్పెండ్ చేసి సభ నుంచి పారిపోయిన కాంగ్రెస్ సర్కార్, ప్రజాక్షేత్రంలో నాలుగు కోట్ల ప్రజల నుంచి మాత్రం తప్పించుకోలేదు. పరిపాలన చేతకేక శాసనసభలో బీఆర్ఎస్ గొంతునొక్కాలని చూస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలపక్షాన తప్పకుండా మూడుచెరువుల నీళ్లు తాగిస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు.
ఆరు గ్యారెంటీలతో ఆగంచేసి, 420 హామీలతో మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా దిశగా నడిపిస్తున్న కాంగ్రెస్ సర్కారు పాపం పండింది. బీఆర్ఎస్ ఇవాళ పూరించిన జంగ్ సైరన్ ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఈ మోసకారి ప్రభుత్వం మెడలు వంచేదాకా ఉద్యమపంథాను కొనసాగిద్దాం. ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు ఇలాగే సంఘటితశక్తిగా ముందుకు సాగుదాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు. జై తెలంగాణ.. జై బీఆర్ఎస్.. అని కేటీఆర్ నినదించారు.