KTR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా, సెప్టెంబర్ 2025 నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అట్టడుగున ఉండటం దారుణమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన మరో స్పష్టమైన సూచిక ఇదేనని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం, కేసీఆర్ సమర్థ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. జీఎస్టీ వృద్ధిలో ఈ పతనం, రేవంత్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఎంత విధ్వంసం పాలయ్యిందో చెప్పే ఒక నిదర్శనమని కేటీఆర్ ధ్వజమెత్తారు.
గత బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయం నుండి ఐటీ వరకూ అన్ని రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి దన్ను ఇవ్వడంతో ఆర్థికవ్యవస్థ పరుగులు తీసి, రికార్డులు తిరగరాసిందని కేటీఆర్ తెలిపారు. కానీ, నేడు కాంగ్రెస్ పాలనలో, పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా కూడా అన్ని రంగాలూ నేలచూపులే చూస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం నుండి రియల్ ఎస్టేట్ వరకూ అన్ని రంగాల్లోనూ దైన్యమే తాండవిస్తోందని మండిపడ్డారు.
“అరాచకత్వం, అవినీతి, అనుభవలేమి కలగలసిన రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి గురవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపడానికి చర్యలు తీసుకోవాలి” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.