KTR | హైదరాబాద్ : ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి ఆదిలాబాద్ అన్నదాతలు భారీగా తరలి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
రైతాంగం ముఖ్యంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు కేటీఆర్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో పత్తి, సోయా రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమకు ఎదురవుతున్న సమస్యలను తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని కేటీఆర్కు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రైతన్నలకు ఇచ్చిన హామీలన్నింటిని పక్కన పెట్టిందని, కనీసం పండిన పంటలను అమ్ముకోవడంలో కూడా సహకారం అందించడం లేదని తెలిపారు.
రైతులతో మాట్లాడిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అంటే ఎందుకు ఈ రోజు అదిలాబాద్ మార్కెట్ యార్డ్ని బంద్ పెట్టారు. మార్కెట్ యార్డులో రైతన్నలను కలుస్తామంటే ప్రభుత్వం ఎందుకు అడ్డంకులు కల్పించింది. చరిత్రలో ఎప్పుడు లేనంత దారుణంగా పత్తి కొనుగోలు సోయా రైతుల పరిస్థితి మారింది. కిసాన్ కపాస్ మొబైల్ అప్లికేషన్ అని తీసుకువచ్చి దాని ద్వారానే పంటలు కొంటాం అంటున్నారు. మరి కనీసం ఫోన్లు లేని రైతన్నల పరిస్థితి ఏమిటి? ఆదిలాబాద్ జిల్లాలో మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ అన్నిచోట్ల ఉండదు. మరి ఇలాంటి సందర్భంలో రైతన్నల పరిస్థితి ఏమిటో చెప్పాలి అని కేటీఆర్ అడిగారు.
రాష్ట్రంలో భారీగా అకాల వర్షాలు పడినందు వలన పత్తి తేమశాతం ఎక్కువగా ఉన్నది. చలి కూడా గతంలో కంటే ఎక్కువగా ఉన్నది అందుకే పత్తిలో తేమశాతం ఉన్నది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి 20 నుంచి 22 శాతం తేమ ఉన్న పంటను కూడా కొనిపించాము. కానీ ఇప్పుడు కేవలం 12 శాతం తేమ ఉంటే కూడా కొనుగోలు చేయము అని చేతులు ఎత్తేసింది. రైతులు పంటలు అమ్ముకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పట్టించుకునే వారు లేరు కనీసం అడిగే వారు కూడా లేరు. కనీసం ఇప్పటిదాకా లక్ష క్వింటాళ్ల పంట కూడా కొనలేదు. ప్రైవేట్ వాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కై రైతుల పంటను దోచుకుంటున్నది అని అనిపిస్తున్నది. లేకుంటే రైతన్నలకు ఎన్ని సమస్యలు వచ్చిన స్పందించకుండా ఉండదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
కనీస మద్దతు ధర రూ. 8,100 రైతుకు దక్కాల్సింది కానీ ఐదారు వేలు కూడా దక్కడం లేదు. సోయాబీన్ అమ్మకానికి సంబంధించి ఫింగర్ ప్రింట్ కావాలని చెప్పి ఒక నిబంధన పెట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. సొంత తల్లిదండ్రుల పేరు మీద ఉన్న పంటలు బిడ్డలు అమ్మాలంటే కూడా కొనుగోలు చేయడం లేదు. పత్తి పంట ఎకరానికి కేవలం 7 క్వింటాళ్లు మాత్రమే కొంటామనే ఒక అర్థరహితమైన నిబంధన పెట్టారు. ఆదిలాబాద్లో ఉన్న భూసార పరిస్థితుల వలన పది పదిహేను క్వింటాళ్ల వరకు ఎకరానికి పండుతుంది మరి మిగిలిన పంటను ఎక్కడ అమ్ముకోవాలి. ఈరోజు మేము రైతన్నలను కలవడానికి వెళ్తున్నామని తెలుసుకున్న ప్రభుత్వం నాటకాలు మొదలుపెట్టారు అని కేటీఆర్ మండిపడ్డారు.
కేంద్రంతో వీడియో కాన్ఫరెన్స్ అంటూ నాటకాలు మొదలుపెట్టారు. కానీ నిన్న జరిగిన క్యాబినెట్లో 50 శాతానికి పైగా తెలంగాణ జిల్లాలో పండుతున్న పత్తి పంట పైన కనీసం మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు సరఫరా నుంచి మొదలుకొని యూరియా సప్లై దాకా చివరికి పంట అమ్మకానికి సంబంధించి కూడా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో రైతన్నల పంటలు కొనుగోలు చేసే పరిస్థితులు కూడా లేవు. దేశంలోనే అత్యుత్తమ పంటను పండించే రాష్ట్రం తెలంగాణ కానీ ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టి రైతన్నలను పట్టించుకోవడం లేదు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
దేశంలో అద్భుతమైన నాణ్యత కలిగిన పత్తి పంట పండుతుంటే కేంద్రంలోని బిజెపి మాత్రం విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేయించుకుంటుంది. పైగా ఇప్పటిదాకా ఉన్న దిగుమతి సుంకాలన్నింటిని ఎత్తివేసింది. కేవలం ఇతర దేశాల్లోని సరఫరాదారులతో చేసుకున్న ఒప్పందాల కోసమే తేమ శాతం, మొబైల్ అప్లికేషన్ ,ఎకరాకు 7 క్వింటాళ్ల వంటి అర్ధరహీతమైన నిబంధనలు పెట్టి విదేశీ సరఫరాదారులతో చేతులు కలిపేందుకే దేశంలోని రైతన్నల నుంచి బిజెపి దేశంలోని రైతన్నల నుంచి పత్తి పంట కొనుగోలు చేయడం లేదు. కేంద్రం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాకుండా కేవలం ఎన్నికలు, రాజకీయాలపైన మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం వలన ఇన్ని సమస్యలు వచ్చాయి. ఇప్పటిదాకా పత్తి కొనుగోలు చేయాలని కనీసం కేంద్రం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేదు అని కేటీఆర్ నిలదీశారు.
రైతన్నల సమస్యల పరిష్కారానికి పోరాటాలు మాత్రమే మార్గం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు అన్ని రకాల పోరాటాలను చేసేందుకు మా పార్టీ సంసిద్ధంగా ఉన్నది. పార్టీ రైతన్నలకు అండగా ఉంటుంది. మొన్న ఆత్మహత్య చేసుకున్న హడావు దీపక్ కుటుంబానికి పార్టీ తరఫున కొంత ఆర్థిక సహాయం చేస్తాం. వెంటనే ప్రభుత్వం పంటల కొనుగోలు కోసం ఫింగర్ప్రింట్ల నిబంధన, కేవలం 12 శాతం తేమ ఉండాలన్న నిబంధన, ఎకరానికి ఏడు క్వింటాల మాత్రమే కొంటామన్న నిబంధన ఇవన్నీటిని వెంటనే ఎత్తివేయాలి. కిసాన్ కపాస్ యాప్ సంబంధం లేకుండా పంట కొనుగోలు చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అధిక వర్షాల వలన నష్టపోయిన రైతన్నలందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించాలి. నష్టపోయిన ప్రతి రైతన్నకు ఎకరానికి 20000 చొప్పున కనీస నష్టపరిహారం చెల్లించాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్థానిక బిజెపి, కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకువచ్చి రైతన్నలకు న్యాయం చేయాలి. వెంటనే ఇక్కడి కేంద్ర మంత్రులు, తెలంగాణ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా స్థానిక రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుపోవాలి. లేకుంటే వారి పైన రైతన్నల పోరాటం తప్పదు అని కేటీఆర్ హెచ్చరించారు.