KTR | సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ అంతా ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిసృహతో కనిపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీతో తిట్లు పడిన తర్వాత వెనక్కి తగ్గాల్సి వస్తుందన్న బాధతో నన్ను కూడా ఇష్టమొచ్చినట్లు తిట్టాడని తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి ఆయన అనుకున్న ముఖ్యమంత్రి పదవి వచ్చిందని.. కావాల్సినంత దోపీడి జరుగుతుందని.. ఇంకా ఎందుకు మమ్మల్ని తిడుతున్నాడో అర్థం కావటం లేదని విమర్శించారు.
నిన్న ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత చిట్టినాయుడును చిప్ దొబ్బినట్లు అనిపించిందని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మేము అదానీకి ప్రాజెక్టులు ఇచ్చామంటాడు. ఎంపీగా కూడా పనిచేసిన ఈయన జాతీయ రహదారుల ప్రాజెక్టులు మేము ఇచ్చామంటున్నాడని మండిపడ్డారు. ప్రజలను తక్కువ అంచనా వేస్తూ వాళ్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా ఇంత తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ చెప్పే వాటిని ప్రజలు నమ్మరని.. మీడియా ఎవ్వరూ కూడా నమ్మరని స్పష్టం చేశారు. రక్షణ శాఖకు ఇచ్చిన ప్రాజెక్టులు మేము ఇచ్చామంటాడు.. రక్షణ శాఖ మా చేతిలో ఉంటుందా? మరీ రాజ్ నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. విద్యుత్ ప్రాజెక్ట్ కూడా కేంద్రం ఇచ్చిందే. ఇంత తెలివితక్కువగా మాట్లాడితే ఏం అనుకోవాలని అన్నారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలను మీడియా మిత్రులు కూడా ప్రశ్నించాలని కేటీఆర్ సూచించారు. డ్రైపోర్ట్ కూడా కేంద్ర, రాష్ట్రానికి సంబంధించిన అంశమని.. కేంద్రం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. దాన్ని కూడా తాము ఎవరికీ ఇవ్వలేదని.. కానీ ఇచ్చినట్లు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్టి నాయుడుకు ఏమీ తెలియదని.. ఎవరన్న చెప్పినా వినడని అన్నారు. ఆయనకో మూర్ఖుడు అని ఎద్దేవా చేశారు.
మైక్రోసాప్ట్ నుంచి రెండు దశల్లో ఒకసారి రూ. 15 వేల కోట్లు…. రెండోసారి రూ. 16 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని కేటీఆర్ తెలిపారు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అది అదానీ డేటా సెంటర్ అని రిలీజ్ చేశాడని మండిపడ్డారు. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని అదానీ డేటా సెంటర్ అని తప్పుడు ప్రచారం చేశాడని అన్నారు. నీకు సబ్జెక్ట్ తెలియక ఏదీ పడితే అది మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటకలుస్తుందని రేవంత్రెడ్డిపై ఆగ్రహం చేశారు. గతంలో కూడా విప్రో ఛైర్మన్ సత్య నాదెళ్ల అంటూ నవ్వుల పాలు అయ్యాడని గుర్తు చేశారు. మైక్రోసాప్ట్ వచ్చాక ఆమెజాన్ వచ్చిందని.. ఆమెజాన్ రూ. 36 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. మొత్తం రూ. 67 వేల కోట్ల విదేశీ పెట్టుబడులను తామే తీసుకొచ్చామని స్పష్టం చేశారు.
నేను అదానీని కలిశాను అని రేవంత్ రెడ్డి ఫోటో రిలీజ్ చేశాడని కేటీఆర్ తెలిపారు. బరాబర్ దావోస్లో కలిశానని.. ఆ ఫోటోను నేనే నా ట్విట్టర్లో పెట్టానని స్పష్టం చేశారు. నీలాగా ఇంటికి పిలిపించుకుని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదని తెలిపారు. కోహినూర్ హోటల్లో కాళ్లు పట్టుకోలేదని అన్నారు. నాకు నీలాగా లుచ్చా పనులు చేసే అలవాటు లేదని పేర్కొన్నారు. ఏదీ చేసిన బజాప్తా చేస్తానని చెప్పారు. అదానీ మేము అసలు ఎంకరేజ్ చేయలేదని స్పష్టం చేశారు. నీ లెక్క లుచ్చా పనులు చేసే.. ఆయన కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు నాది కాదని రేవంత్పై మండిపడ్డారు. ఫ్రస్ట్రేషన్లో నన్ను తిడుతున్నావ్ సరే నాకు ఏమీ ఫరక్ పడదు. ప్రశ్నిస్తే నేను సైకోనా అని ప్రశ్నించారు. కొండారెడ్డి పల్లిలో నీ కోసం పనిచేసిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమయ్యావ్. మరి నువ్వు శాడిస్ట్ వా అని అన్నారు. నువ్వు తప్పు చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న శాడిస్ట్ ముఖ్యమంత్రివి అని మండిపడ్డారు. ఏం చేస్తావో చేసుకో.. నీకు భయపడేవాళ్లం కాదని స్పష్టం చేశారు.