KTR | సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తెచ్చింది లేదని విమర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలి 8 మంది కార్మికులు చిక్కుకుంటే.. ఎన్నికల ప్రచారంలో మునిగి తేలావని మండిపడ్డారు. మూడు నెలలుగా జీతాల్లేక అల్లాడుతున్నామని కార్మికులు వాపోతుంటే ఎన్నికల ప్రచారం ముగించుకుని నిమ్మలంగా మళ్లీ హస్తిన బాటపట్టావని అన్నారు.
సొరంగంలో సహాయక చర్యలు ఒక్కడుగు ముందుకు .. వందడుగులు వెనక్కి అన్నట్లుగా ఉందని కేటీఆర్ విమర్శించారు. అక్కడ ఆక్సిజన్ లేదు.. కన్వేయర్ బెల్టు తెగిపోయిందని తెలిపారు. 96 గంటలు దాటినా ఒక్కడుగూ ముందుకు పడటం లేదని తెలిపారు. కాళేశ్వరం పర్రెల మీద శ్రీశైలం అగ్నిప్రమాదం మీద కారు కూతలు కూసి, విషపు రాతలు రాసిన మేధావుల నోళ్లు ఎస్ఎల్బీసీ విషయంలో మాత్రం నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హస్తిన యాత్రలు మాని.. ఆ కార్మికుల గోడు వినాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు. ఆ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు. అక్కడ చిక్కుకున్నవి సాధారణ ప్రాణాలు కాదు .. ఈ జాతి సంపద అని స్పష్టం చేశారు.