KTR | హైదరాబాద్ : సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న వివక్షను, జల దోపిడీని ప్రజలకు అర్థమయ్యే భాషలో సులువుగా వివరించిన మేథావి మన విద్యాసాగర్ రావు అని కొనియాడారు.
తెలంగాణ జనహృదయాల్లో ఒక జలవిజ్ఞాన నిధిగా, నీళ్ళ సారుగా నిలిచిపోయిన వారు సాగునీటి రంగంలో చేసిన కృషి అనితరసాధ్యం. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం వారి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, కేసీఆర్ ఆహ్వానంతో విద్యాసాగర్ రావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా సేవలందించారు. అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో విలువైన సలహాలు, సూచనలు అందించారు. విద్యాసాగర్ రావు మరణం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం, ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా డిండి ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టింది. విద్యాసాగర్ రావు జన్మస్థలం జాజిరెడ్డిగూడెంలో ఆయన పేరు మీద ఒక సబ్మార్కెట్ యార్డును నిర్మించింది అని కేటీఆర్ గుర్తు చేశారు.