KTR | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి.. ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని రేవంత్కు కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బీఆర్ఎస్ పని అయిపోయింది.. కేసీఆర్ శకం ముగిసింది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలవరు అని రేవంత్ రెడ్డి అన్నారు. దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టు అని నాకు రేవంత్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నువ్వు గొప్పోడివి కాదా..? ఒక్క సీటు కూడా గెలవరు అన్నావు కదా.. మల్కాజ్గిరి సీటులో పోటీ చేద్దాం. తేల్చుకుందాం రా అని అన్నాను. కానీ స్పందన లేదు. మళ్లీ నోరు ఎత్తలేదు అని కేటీఆర్ గుర్తు చేశారు.
మల్కాజ్గిరిలో ఈ ఐదేండ్లలో రేవంత్ ఒక్క పని చేయలేదు. ఎవర్నీ పలుకరించినా పాపాన పోలేదు. కాబట్టి ఆవేశానికి పోతే ఓడిపోతానని రేవంత్ భయపడ్డాడు. అందుకే పలుకలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో నిలబడేందుకు భయపడుతున్నాడు. ఏప్రిల్ 18న నామినేషన్లు.. సమయం చాలా ఉంది కాబట్టి రేవంత్కు ధైర్యం వచ్చి రాజీనామా చేసి వస్తే నేను వస్తా.. తప్పకుండా నిలబడుతాను. నాకు తెలుసు ఆయన రాడు.. పిరికోడు. నరుకుడు ఎక్కువ.. అసలు విషయానికి వస్తే పారిపోతాడు. చాలా పెద్ద మాటలు, డైలాగులు చెబుతాడు. కానీ ఆచరణలో మాత్రం చూపించడు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
మల్కాజ్గిరిలో జరిగే పోటీ.. కేవలం వ్యక్తుల మధ్య కాదు.. పోటీ మూడు పార్టీల మధ్య. కేసీఆర్ నిలబడ్డారని భావించి పని చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో తుఫానులా మెజార్టీ ఇచ్చారు. మూడు లక్షల యాభై ఓట్ల మెజార్టీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇతర పార్టీలు మూడున్నర లక్షలు దాటి ముందుకు వచ్చి గెలవాలి. అయినా కూడా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలి. కార్పొరేట్ ఎన్నికల్లో మాదిరిగానే ప్రతి ఇంటికి వెళ్లాలి. దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. కాబట్టి ప్రతి వాడ తిరిగి ప్రచారం చేయాలి. రాగిడి లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.