న్యూఢిల్లీ, ఆగస్టు 13 : బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. గత వారం రోజులుగా భారీగా పుంజుకున్న ధరలు దిగొచ్చాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.2,800 తగ్గింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి ధర రూ.1.57 లక్షలకు దిగొచ్చింది. అంతకుముందు రూ.1,59,800గా ఉన్నది. బంగారంతోపాటు వెండి ధరలు దిగొచ్చాయి.
పారిశ్రామిక వర్గాలు, ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.6 వేలు తగ్గి రూ.2.40 లక్షలకు దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.2.46 లక్షలుగా ఉన్నట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,389.67 డాలర్లుగాను, వెండి 65.03 డాలర్లుగా ఉన్నది.