KTR | హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జల హక్కులను కృష్ణా బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ 13న నల్లగొండలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామని, హైదరాబాద్లో ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
శనివారం తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో, సికింద్రాబాద్లో సనత్నగర్ నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ విజయోత్సవ సభలో కేటీఆర్ మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీగా మొదటి ప్రజా ఉద్యమం ఇదేనని, ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన హక్కులను కాపాడుకున్నామని, కేవలం రెండు నెలల వ్యవధిలోనే చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్రెడ్డి నిర్వాకంతో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను సీఎం రేవంత్రెడ్డి కేంద్రప్రభుత్వానికి తాకట్టు పెట్టారని కేటీఆర్ విమర్శించారు. సీఎంకు క్రిమినల్ ఆలోచనలు తప్ప ఇంకొకటి లేవని మండిపడ్డారు. 13న నల్లగొండలో నిర్వహించే సభకు కృష్ణా బేసిన్లో ఉండే జిల్లాల ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్కు అవగాహన శూన్యం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కట్టిందే తామని, మళ్లీ తాము వెళ్లి చూడాల్సిన పనిలేదని, ఆ ప్రాజెక్టుపై అవగాహన పెంచుకోవాల్సింది కాంగ్రెస్వాళ్లేనని చురకలంటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి తెలుసుకోవాలనుకుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వెళ్లి నేర్చుకోవచ్చని సూచించారు.
కాళేశ్వరం నీటితో పండించిన పంటల వల్లే నేడు తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందని చెప్పారు. మేడిగడ్డ వద్ద జరిగిన చిన్న తప్పును పట్టుకొని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందనే కుటిల ప్రయత్నం చేస్తే అది సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అని అన్నారు. రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును భ్రష్టు పట్టించాలని చూస్తే అది కాంగ్రెస్ అమాయకత్వమేనని ఎద్దేవా చేశారు. ఎకడైనా తప్పు జరిగితే బయటపెట్టాలని, ఏ విచారణకైనా తాము సిద్ధమని స్పష్టంచేశారు.
మేడిపండులా బడ్జెట్
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా, ఓ మేడిపండు లాగా ఉన్నదని కేటీఆర్ విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలుకు రూ.1.25 లక్షల కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో కేవలం రూ.53 వేల కోట్లు కేటాయించారని విమర్శించారు. మహాలక్ష్మి పథకానికే ఏటా రూ.53 వేల కోట్లు కావాలని, రైతు రుణమాఫీకి రూ.39 వేల కోట్లు, రైతు భరోసాకు రూ.24 వేల కోట్లు కలిపితే రూ.1.25 లక్షల కోట్లు దాటిపోతుందని తెలిపారు.
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆశించేది చిల్లర మాటలు, డ్రామాలు కాదని.. ఇచ్చిన 420 హామీలు ఎప్పుడు నేరవేర్చుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. శిశుపాలుడు కూడా 100 తప్పులు చేసే దాకా కృష్ణుడు ఊరుకున్నాడని, మనం కూడా వంద రోజుల్లో వారు ఇచ్చిన హామీలు నేరవేర్చకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
టీఎస్ తీసేసి టీజీ పెట్టడం, తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ తీసేయటం వంటి చిల్లర పనులు మాని ప్రజలు ఆశించే పనులు చేయాలని సూచించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. ప్రతి కరెంటు మీటర్కు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
సమావేశాల్లో మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద్, అరికపూడి గాంధీ, దానం నాగేందర్, ముఠా గోపాల్, పాడి కౌశిక్రెడ్డి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.