హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సాకుతో చంద్రబాబు, మోదీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భారీ కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆరోపించారు. సీబీఐ విచారణ పేరుతో కేవలం కేసీఆర్, బీఆర్ఎస్ మీదనే దాడి జరగడం లేదన్న కేటీఆర్.. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి మన గోదావరి జలాలను ఆంధ్రకు తరలించే కుతంత్రాలకు ఆ ముగ్గురు తెరతీశారని విమర్శించారు.
తెలంగాణ గొంతుకగా ఉన్న కేసీఆర్, బీఆర్ఎస్లను లేకుండా చేసి తెలంగాణపై తిరిగి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మోదీ, చంద్రబాబు ఎజెండా మేరకు బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెట్టారని, ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించడం అంటే ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టడమేనని అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను మోదీ జేబు సంస్థలుగా విమర్శించిన రేవంత్.. 48 గంటల్లోనే ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓ వైపు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కేంద్ర దర్యాప్తు సంస్థలను అధికార బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం మోదీ ప్రాపకం కోసం వాటిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి చేదుగా అనిపించిన సీబీఐ, రేవంత్కు మాత్రం ముద్దొస్తుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కోరగానే సీబీఐకి అప్పజెప్పడం ఆ రెండు పార్టీల అక్రమ బంధానికి సాక్ష్యం అని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, బంగారు తెలంగాణ నిర్మాతగా చరిత్ర సృష్టించిన కేసీఆర్ మీద విష ప్రచారం చేయాలన్న దుర్మార్గ, రాక్షస ఆలోచనతో రేవంత్ ఉన్నాడని కేటీఆర్ విరుచుకుపడ్డారు. గతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలినా, సుంకిశాలలో సైడ్ వాల్ కూలినా, వట్టెం పంప్ హౌజ్ కూలిపోయినా, పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని కేటీఆర్ గుర్తుచేశారు. అప్పుడు రాని జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (NDSA).. మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగితే మాత్రం ఆగమేఘాల మీద వచ్చి తలాతోకలోని రిపోర్ట్ ఇచ్చిందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి మీద ఈగ కూడా వాలకుండా ప్రధాని మోదీ కాపాడుతున్న సంగతిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. పద్నాలుగేళ్లు ఉద్యమంలో, పదేళ్లు ప్రగతి ప్రస్థానంలో, రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ఏకైక గొంతుకగా నిలుస్తున్న కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని అణచివేసే కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందన్నారు. సీబీఐకే కాదు, ఏ ఏజెన్సీకి కాళేశ్వరం విచారణ అప్పచెప్పినా బీఆర్ఎస్ పార్టీ భయపడదని చెప్పారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు.
న్యాయస్థానాలపైన తమకు సంపూర్ణ నమ్మకం ఉందన్న కేటీఆర్.. అక్కడ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. బెదిరింపులు, కేసులు తమకు కొత్త కాదని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలకైనా, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని స్పష్టంచేశారు.