హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్ రెండోసారి కొట్టుకుపోయినా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి కనిపించడం లేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరంలో భాగమైన ఒక్క మేడిగడ్డ బరాజ్లో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారుకూతలు కూసిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు పోలవరాన్ని.. కూలవరం అనే దమ్మూధైర్యం ఉన్నదా? అని నిలదీశారు. తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరోనీతా? అని శనివారం ఒక ప్రకటనలో కడిగి పారేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే ఎన్డీఎస్ఏను దించి బీఆర్ఎస్పై బురజల్లిన బీజేపీ నేతలు.. కండ్ల్లముందే రెండోసారి కొట్టుకుపోయిన పోలవరం కాఫర్డ్యామ్పై ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ఛేదిస్తం
ఏకంగా 10 అడుగుల వెడల్పు.. 7 నుంచి 8 అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్ డ్యామ్కు గుట్టుచప్పుడు కాకుండా ఏపీలో యుద్ధప్రాతిపదికన రిపేర్ చేయిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బరాజ్ వద్ద తట్టెడు సిమెంట్కు దికులేకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమేనని మండిపడ్డారు. 2020లో పోలవరం డయాఫ్రం వాల్ రెండేండ్లకే కొట్టుకుపోయినా ఇప్పటికీ ఊలుకూ లేదు, పలుకూ లేదని నిప్పులు చెరిగారు. మరోసారి ఏపీలో పోలవరం కాఫర్డ్యామ్ గోదావరిపాలైనా, ఇటు తెలంగాణలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది చనిపోయినా ఇప్పటికీ ఎన్డీఎస్ఏ అడ్రస్ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంజాబ్నే తలదన్నే స్థాయిలో తెలంగాణలో వ్యవసాయ విప్లవాన్ని సృష్టించి, దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతును తీర్చిదిద్దిన కేసీఆర్పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న మూకుమ్మడి కుట్రలను ఛేదిస్తామని హెచ్చరించారు. తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టంచేశారు.
కాళేశ్వరంలో భాగమైన ఒక్క మేడిగడ్డ
బరాజ్లో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారుకూతలు కూసిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు పోలవరాన్ని.. కూలవరం అనే దమ్మూధైర్యం ఉన్నదా?
-కేటీఆర్