KTR | హైదరాబాద్ : గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహారం బదులు విషం పెడితే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
ఏడాది కాలంలో వేల మంది విద్యార్థులు కల్తీ ఆహారంతో ఫుడ్ పాయిజన్కు గురవడం, వంద మందికి పైగా విద్యార్థులు చనిపోవడం ప్రభుత్వ పూర్తిస్థాయి వైఫల్యం అని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దీనికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనలు జరిగిన తరువాత కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం రేవంత్ నియంతృత్వ అమానవీయ పాలనకు నిదర్శనం. రేవంత్ రెడ్డి ఇంత మంది విద్యార్థులు అనారోగ్యం పాలైనా, ఆత్మహత్యలు చేసుకున్నా, మరణాల పాలయ్యినా పట్టించుకోకపోవడం నేరపూరిత నిర్లక్ష్యం అని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురుకుల విద్యాసంస్థల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్, మరణాల అంశాన్ని ప్రభుత్వ దృష్టికి అనేకసార్లు తీసుకువచ్చా. ఈ అంశాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ప్రతిసారి మంత్రులు కంటి తుడుపు చర్యలతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని కేటీఆర్ తెలిపారు.
ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతటి అమానవీయ సంఘటనలపై చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఒక్క సమీక్ష చేయడానికి కూడా సమయం కేటాయించలేకపోయారని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. పిల్లలు కలిగిన ఒక తండ్రిగా అడుగుతున్నా. ఈ అంశంలో ముఖ్యమంత్రిగా కాకుండా కనీసం ఒక తండ్రిగా అయినా రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. తన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహారం బదులు విషం పెడితే ముఖ్యమంత్రి ఊరుకుంటాడా? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదే పరిస్థితి రేవంత్ రెడ్డి పిల్లలకు జరిగితే కూడా ఇలానే వదిలేస్తారా? అని ప్రశ్నించారు. దయచేసి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని గంభీరంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో మన కుటుంబసభ్యులు, మీ కుటుంబసభ్యులు నష్టపోతే మీరు ఊరుకుంటారా? మీ పిల్లలకు ప్రభుత్వం విషం కలిపిన ఆహారం పెడితే మౌనంగా ఉంటారా? ఇన్ని దారుణాలు జరుగుతున్నా బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గతంలో అన్నట్లే ఇప్పుడు ఎవరు బాధ్యులు? ఎవరినీ ఉరితీయాలో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.