KTR | హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మోదీకి, అమిత్ షాకు నోటీసులు జారీ చేయరు. కానీ ఆవేదనతో మాట్లాడిన కేసీఆర్కు మాత్రం నోటీసులు జారీ చేసి, 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం విధించారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై 48 గంటల పాటు ఈసీ నిషేధం విధించింది. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, వారు తీసుకున్న నిర్ణయాలు దానికి అనుగుణంగా జరిగిన నియామకాలు, స్వయం ప్రతిపత్తి సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆటాడిస్తున్నట్లు స్పష్టమవుతుంది. చివరకు ఎన్నికల కమిషన్ కూడా బీజేపీ కనుసన్నల్లో నడుస్తోంది. ఇందులో ఎలాంటి రెండో ఆలోచన, అభిప్రాయం తమకు లేదు. దేశంలో బీజేపీ వాళ్లు జాతులు, మతాల ఆధారంగా.. ప్రధాని, హోం మంత్రి మత వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన, విద్వేషాన్ని రెచ్చగొట్టేలా దారుణమైన వ్యాఖ్యలు చేసినా, ప్రత్యర్థ పార్టీలను బీజేపీ నాయకులు బండబూతులు తిడుతున్నా.. వాళ్ల బీజేపీ4ఇండియా అఫిషియల్ ట్విట్టర్ ముస్లింలపై విషం చిమ్ముతూ.. ప్రచారం చేస్తున్నా ఒక్క చర్య లేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు అని కేటీఆర్ తెలిపారు.
ఇటీవలే మోదీ దారుణంగా మాట్లాడారు. ఈ దేశంలో ముస్లింలే ఎక్కువ పిల్లలు కంటారని, వేరే వారు అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లింలకు దోచి, పంచి పెడుతారని ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే దాదాపు 25 వేల మంది పౌరులు ఎన్నికల కమిషన్కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. కానీ కనీసం మోదీకి నోటీసు కూడా ఇవ్వలేదు. చర్యలు తీసుకోవడం లేదు. మోదీకి భయపడ్డ ఎన్నికల సంఘం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీసులు జారీ చేశారు. మోదీ వ్యాఖ్యలపై నడ్డా జవాబు ఇవ్వాలని తలాతోక లేని నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది అని కేటీఆర్ గుర్తు చేశారు.
ఎన్నికల్లో దేవుడిని, మతాన్ని ఇన్వాల్వ్ చేయడం నేరం. అమిత్ షా శ్రీరాముడి బొమ్మ పట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. దీనిపై కూడా ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అయినా ఉలుకు పలుకు లేదు. బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ గతంలో రామాయణం సిరీయల్లో రాముడి పాత్ర పోషించారు. ఆయన రాముడి ఫొటోతో ప్రచారం చేశారు. చర్య, నోటీసులు లేవు. బీజేపీ4 ఇండియా అఫిసియల్ ట్విట్టర్లో రాముడి ఫోటో పెట్టి మీ ఓటును బీజేపీకి వేయాలని ప్రేరేపిస్తున్నారు. మోదీ విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసినా, హోం శాఖ మంత్రి రాముడి ఫొటో పట్టుకుని ఓట్లు అడిగానా ఉలుకు పలుకు లేదు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, హిందూ ముస్లింలను విడదీసేలా బీజేపీ4ఇండియా దాడి చేసినా ఎన్నికల కమిషన్ మేల్కోవడం లేదన్నారు కేటీఆర్.
అదే కేసీఆర్ విషయానికి వస్తే ఆగమేఘాల మీద నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన తర్వాత మా లాయర్లు, నాయకుల స్పందించి లీగల్ సెల్ ద్వారా జవాబు ఇచ్చారు. ఈ మద్యకాలంలో ఎండిన పంటల పరిశీలనకు కరీంనగర్కు వచ్చినప్పుడు సిరిసిల్లలో మీడియా సమావేశం నిర్వహించారు కేసీఆర్. ఎండిన పంటలు చూసిన తర్వాత, రైతుల ఆర్తనాదాలు విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి బుద్ది లేదు.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు.. నీళ్లు ఉండి ఇవ్వలేని ప్రభుత్వం ఇది అని కొంత పరుషంగా చెప్పారు. బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇవ్వండి.. మా బతుకును కాపాడాలని, మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని మొర పెట్టుకున్నారు. వారి ఆవేదన, బాధ చూసిన తర్వాత భావోద్వేగతంతో కేసీఆర్ ఒక మాట అన్నారు. ఆ ఒక్క మాట మాట్లాడేసరికి కేసీఆర్ గొంతు నొక్కారు. 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం విధించారు అని కేటీఆర్ తెలిపారు.