KTR | హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఫాక్స్కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్కాన్ కంపెనీకి లేఖ రాయడంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ జలవిహార్లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఫాక్స్కాన్ కంపెనీ ఆపిల్ ఫోన్లకు సంబంధించిన అనేక పరికరాలు తయారు చేస్తోంది. చైనాలో 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది. మనం కష్టపడి నాలుగేండ్లు వెంబడి పడి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఒప్పించుకున్నాం. వివిధ వేదికల్లో అమెరికా, చైనా తైవాన్లో కలిసిన తర్వాత 2022లో ఫాక్స్ కాన్ చైర్మన్ హైదరాబాద్కు వచ్చి సీఎం కేసీఆర్ను కలిసి ఫ్యాక్టరీ పెడుతాం అని ప్రకటించారు. ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా కొంగరకొలాన్లో 200 ఎకరాల స్థలంలో నిర్మాణం ప్రారంభించారు. రెండు అంతస్తులు పూర్తయ్యాయి. వచ్చే ఏప్రిల్, మే నెలలో ఫాక్స్ కాన్ కంపెనీ ప్రారంభం కానుంది అని కేటీఆర్ తెలిపారు.
అయితే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్కాన్ కంపెనీకి అక్టోబర్ 25న లేఖ రాశారు. ఆపిల్ ఎయిర్ పొడ్స్ ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మార్చండి. తొందరల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. హైదరాబాద్ నుంచి పరిశ్రమలను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి బెంగళూరుకు తరలిస్తాం. ఇందుకు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుంది అని డీకే శివకుమార్ తన లేఖలో పేర్కొన్నట్లు కేటీఆర్ గుర్తు చేశారు.
అంటే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతది అనే దానికి ఇది ఒక చిన్న ఉదహరణ. ఢిల్లీ చేతిలో మన జుట్టు ఇస్తే, కొట్లాడే మొనగాడు, తెలంగాణ ప్రజయోజనాలు పరిరక్షించే నాయకుడు లేకపోతే పరిస్థితి ఇలానే తయారవుతుంది. కాంగ్రెస్కు బెంగళూరు అడ్డా అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ టికెట్లు ఢిల్లీలో కాకుండా, బెంగళూరులో కూడా డిసైడ్ అవుతున్నాయి. పైసలన్నీ బెంగళూరులో దొరుకుతున్నాయి. సిద్ధారమయ్య, డీకే శివకుమార్ కష్టపడి సంపాదించిన పైసలు తెలంగాణకు తరలుతున్నాయి. అడ్డంగా దొరికిపోతున్నాయి. అధికారం కాంగ్రెస్ చేతిలోకి వెళ్తే.. లక్ష ఉద్యోగాలు ఇచ్చే ఫాక్స్కాన్ పరిశ్రమను బంద్ చేసి బెంగళూరుకు తరలిస్తారు అని కేటీఆర్ పేర్కొన్నారు.