KTR | కరీంనగర్ : నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాలం మంచిగా కాలేదు.. కరువు వస్తున్నది.. అందరం కలిసి ఎదుర్కొందాం అంటున్నాడు. ఇది కాలం తెచ్చిన కరువు కానేకాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కదన భేరీ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణలోని భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, రైతుల దుస్థితి పట్ల కేసీఆర్కు పూర్తిస్థాయి అవగాహన ఉంది. కాబట్టే రైతులకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో పని చేశారు. గతంలో ఎన్నో ఏండ్లు వరుస కరువు చూశాం. కేసీఆర్ ముందు చూపుతోనే ఆ కరువు మీద సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో రిపేర్లు చేసి ఉంటే చొప్పదండి, హుజురాబాద్, కరీంనగర్, మానకొండూరులో ఎండుతున్న పంటలకు ఆ నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుండే. ఈ సన్నాసి రేవంత్ రెడ్డికి మేడిగడ్డ, కాళేశ్వరం, మల్లన్నాసాగర్ అంటే ఎంటో తెల్వదు. చెరువులు నింపుడు తెల్వదు. రైతుల పంటలు కాపాడుడు అంతకంటే తెల్వదు. అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కానేకాదు.. కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఊరురా చెప్పాలి. ఇదే టైంలో కేసీఆర్ ఉండి ఉంటే ఎట్లైనా నీళ్లు తెచ్చి పంటలు కాపాడుతుండే. కేసీఆర్ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే ఎల్ఎండీని ఖాళీ చేస్తున్నారు. భవిష్యత్లో కరీంనగర్లో కూడా గొంతు ఎండుతది.. డైలీ వాటర్ సప్లయి బంద్ అయితది. కేసీఆర్ను బద్నాం చేయడానికి ఇంత చిల్లర రాజకీయం సరికాదు అని కేటీఆర్ మండిపడ్డారు.
గతంలో టీడీపీని ముంచిండు.. ఇప్పుడు కాంగ్రెస్ను కూడా ముంచేటట్టు ఉన్నారని ముస్లిం సోదరులు భావిస్తున్నారు. మోదీని రేవంత్ పొగడ్తలతో ముంచెత్తారు. ఆత్మగౌరవం కలిగిన ఏ తెలంగాణ బిడ్డ మాట్లాడని, ఒప్పుకొని మాటలు రేవంత్ మాట్లాడారు. రైతుబంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నారు. మిషన్ భగీరథను చూసి హర్ ఘర్ జల్, మిషన్ కాకతీయను చూసి అమృత్ సరోవర్ అని పెట్టుకున్నారు. అలా అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారింది. అలాంటి తెలంగాణ మోడల్ను కించపరుస్తూ.. గుజరాత్ మోడల్ను చేస్తాం ఈ రాష్ట్రాన్ని అని రేవంత్ మాట్లాడుతున్నారు. గుజరాత్ మోడల్ అంటే తెల్లారితే హిందువులు, ముస్లింలు తన్నుకోవడమా..? రైళ్లల్లో పోయేటోళ్లను కాల్చి చంపుడా..? గుజరాత్ మోడల్ అంటే.. అందులో నీకేం నచ్చింది. గుజరాత్ మోడల్ను బేకర్ మోడల్, అట్టర్ ప్లాఫ్ మోడల్ అని రాహుల్ అంటాడు. అదానీని పొట్టుపొట్టు తిడుతాడు రాహుల్. నువ్వేమో అదానీతో ఆలయబలయ్ చేసుకుంటావ్. దిక్కుమాలిన పనులు చేసిన రేవంత్ ప్రభుత్వం.. 90 రోజుల్లోనే ప్రజాభిమానాన్ని కోల్పోయి ప్రజల్లో పలచన అయింది అని కేటీఆర్ పేర్కొన్నారు.