Nagarjuna | అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్రబృందం నిర్వహించిన బ్లాక్బస్టర్ సక్సెస్ మీట్లో నటుడు నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా.. విడుదల తేదీలు, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యాలపై ఆయన చేసిన సూచనలు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముందుగా ‘లెనిన్’ విజయంపై స్పందించిన నాగార్జున.. ఈ తరహా విజయాన్ని అఖిల్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడని అన్నారు. “అభిమానుల అరుపులు, థియేటర్లలో వచ్చే స్పందన కోసం అఖిల్ ఎంతోకాలంగా వెయిట్ చేశాడు. ఈ విజయం మా కుటుంబానికి పండగలా మారింది. నాకు, చైతన్యకు, అఖిల్కు ఈ సక్సెస్ ఎంతో ప్రత్యేకం. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి ‘మ్యాట్నీ నుంచి అదనపు షోలు వేస్తున్నాం’ అనే ఫోన్ కాల్స్ రావడం ఎంతో సంతోషంగా ఉంది.
రివ్యూల కంటే ఇలాంటి కాల్స్ కోసం మేము ఎక్కువగా ఎదురుచూస్తుంటాం అని చెప్పారు. అనంతరం చిత్రానికి పనిచేసిన రచయిత సత్యానంద్, గేయరచయిత రామజోగయ్య శాస్త్రి, పోస్ట్ ప్రొడక్షన్ బృందానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టాలీవుడ్లో తరచూ జరుగుతున్న రిలీజ్ డేట్ మార్పులపై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్లో ‘ఒడిస్సీ’ వంటి సినిమాలకు ఏడాది ముందే విడుదల తేదీ ప్రకటించి, అదే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. కానీ మన దగ్గర విడుదల తేదీ ప్రకటించిన తర్వాత కూడా సాంకేతిక పనులు పూర్తి కాక వాయిదా వేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ‘లెనిన్’ సినిమాను కూడా మొదట జూన్ 26న విడుదల చేయాలనుకున్నాం. అయితే పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో రెండు వారాలు వాయిదా వేయాల్సి వచ్చింది అని వివరించారు.
పోస్ట్ ప్రొడక్షన్ ప్రక్రియకు తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని నాగార్జున అన్నారు. సినిమా కంటెంట్ను కనీసం రెండు వారాల ముందే పోస్ట్ ప్రొడక్షన్ టీమ్కు అందిస్తే వారు మరింత నాణ్యతతో పని చేయగలరు. కానీ చివరి నిమిషం వరకు మార్పులు చేస్తూ ఆలస్యం చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు ఈ విషయంలో ఆలోచించాలి అని సూచించారు. అలాగే, ‘నిన్నే పెళ్లాడతా’, ‘అన్నమయ్య’ వంటి చిత్రాల సమయంలో నెల రోజుల ముందే ఫైనల్ కాపీ సిద్ధమయ్యేదని గుర్తు చేసిన నాగార్జున.. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ప్రకటించిన తేదీకే సినిమాలు విడుదలైతే పరిశ్రమకు, ప్రేక్షకులకు, వ్యాపారానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.