KTR | మేడ్చల్ మల్కాజ్గిరి : శ్రీరాముడు అందరివాడు.. ఆ రాముడితో మనకు పంచాయితీ లేదు.. పంచాయితీ అంతా బీజేపీతోనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ పదేండ్లలో ఏం చేశారని బీజేపోళ్లను ప్రశ్నిస్తే జైశ్రీరాం అంటారు. మనకు రాముడితో పంచాయితీ లేదు.. రాముడికి మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం. రాముడు బీజేపీ పార్టీ మనిషి కాదు.. ఆయన అందరి మనిషి. ఆయన లోక ప్రియుడు. అలాంటి రాముడితో మనకు తగాదా లేదు. రాముడి పేరు చెప్పుకుని రాజకీయం చేసే బీజేపీని తన్ని తరిమేయాలన్నారు కేటీఆర్.
ఈ పదేండ్లు ఏం చేశారని ప్రశ్నిస్తే చెప్పేటందుకు బీజేపీ నేతల వద్ద ఏం లేదు. రైతు రుణమాఫీ విషయంలో ఈటల రాజేందర్ బాధపడుతున్నారట. రూ. పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలను బడా వ్యాపారులకు మోదీ మాఫీ చేశారు. కానీ రైతులకు సంబంధించి ఒక్క రూపాయి రుణం కూడా మాఫీ చేయలేదు. కరోనా సమయంలో కూలీలు తమ సొంతూర్లకు వెళ్లేందుకు కనీసం ఫ్రీ రైళ్లు పెట్టలేదు మోదీ. కేసీఆర్ మాత్రం 180 రైళ్లు ఫ్రీగా పెట్టి రూ. 500 ఇచ్చి బీహార్, యూపీకి పంపించారు. కానీ మనసు లేని మోదీ ఆ పని చేయలేకపోయారు. ఇవన్నీ మరిచిపోవద్దు. పెద్ద నోట్లు రద్దు చేసి దేశాన్ని ఆగం చేశాడు. పెద్ద పెద్ద సేట్లకు పని చేసే మోదీ.. మనకు, తెలంగాణకు ఏం పని చేయలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.
తెలంగాణపై బీజేపీకి ప్రేమ ఉంటే.. భద్రాచలం టెంపుల్కు ఒక్కరూపాయి అయినా ఇచ్చిండా..? అయోధ్య రాముడే రాముడా..? భద్రాచలం రాముడు రాముడు కాదా..? ఘట్కేసర్లో రామలింగేశ్వర స్వామి టెంపుల్కు ఒక్క రూపాయి అయినా కిషన్ రెడ్డి ఇచ్చారా..? ఒక్క రూపాయి కూడా ఇవ్వని బీజేపీకి ఓటు వేద్దామా..? యాదాద్రిని రాజకీయంగా వాడుకోలేదు. దేవుడు దేవుడే.. ధర్మం ధర్మమే.. రాజకీయం రాజకీయమే. ఎవరు మన కోసం పని చేస్తున్నారో.. ఎవరు దేవుళ్లను అడ్డం పెట్టుకుని బతుకుతున్నారో ప్రజలకు వివరించాలి. నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల, మతోన్మాదానికి కారణమైన బీజేపీని పాతరేయాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.