హైదరాబాద్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణపై పార్లమెంట్ సాక్షిగా మరోసారి విషం చిమ్మిందని గురువారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదికైన లోక్సభలో బీజేపీ నేతలు తెలంగాణ ఆవిర్భావంపై ద్వేషాన్ని వెళ్లగక్కడం దుర్మార్గమని, తేజస్వి తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై ఏమాత్రం గౌరవం లేదనే విషయం రుజువైందని మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చడం బీజేపీ మూర్ఖత్వానికి పరాకాష్ట అని విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తిన కేటీఆర్, అడుగడుగునా అమరుల త్యాగాలను అవమానిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నాడు ప్రధాని మోదీ.. నేడు తేజస్వీ
ప్రధాని మోదీ మొదలు తాజాగా ఆ పార్టీ ఎంపీ తేజస్వీ సూర్య దాకా తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణపై అదే పనిగా విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటుందని స్పష్టంచేశారు. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో, ఎవరి భిక్షతోనో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాలేదని, దశాబ్దాల సుదీర్ఘ పోరాటం.. వేలాది మంది యువకుల బలిదానాల ఫలితంగా తెలంగాణ విముక్తి పొందిందని ఆయన గుర్తుచేశారు. అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం నాలుగుకోట్ల మంది ఏకమై చేసిన ప్రజాస్వామ్య పోరాటాన్ని దేశ విభజన లాంటి విషాదకర ఘటనలతో పోల్చడం ఎంతవరకు సమంజసమని కేటీఆర్ ప్రశ్నించారు.
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తీరు సిగ్గుచేటు
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై విషం చిమ్ముతుంటే సభలో ఉన్న ఇక్కడి 16మంది బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు సైతం తేజస్వీ వ్యాఖ్యలను ఖండించకపోవడం బాధాకరమని మండిపడ్డారు. తమ కండ్లముందే తెలంగాణను అవమానిస్తున్నా అడ్డుకోలేని వీళ్లు.. నాలుగుకోట్ల ప్రజలకు ఏం ముఖం చూపుతారని నిలదీశారు.
తెలంగాణ ఆవిర్భావంపై పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య విషం కక్కడం అత్యంత దుర్మార్గం. నాడు ప్రధాని మోదీ, ఇప్పుడు ఇతర బీజేపీ నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరుల త్యాగాలను అవమానిస్తూనే ఉన్నారు. తేజస్వీ వ్యాఖ్యలతో బీజేపీ కుసంస్కారం బయటపడింది. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. తేజస్వీ, బీజేపీ బేషరతుగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. – కేటీఆర్