KTR | చెన్నై : డీలిమిటేషన్ వలన దక్షిణాదికి జరగనున్న నష్టాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అద్భుతంగా తెలియచెప్పారు. ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. నిధులు కేంద్రీకృతం కావడంతో పాటు.. ఆర్థిక నియంతృత్వానికి దారి తీస్తుందని… దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని కేటీఆర్ వివరించారు. దేశం ప్రజాస్వామిక దేశమైనా… భిన్న అస్తిత్వాలు, సంస్కృతులు కలిగిన ఒక సమాఖ్య రాష్ట్ర అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు.
కేవలం జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల గనుక జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉన్నది అని కేటీఆర్ అన్నారు. మనమందరం భారతీయులం.. అయితే మనందరికీ ఆయా ప్రాంతాల అస్తిత్వం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. విభిన్న భాషలు సాంస్కృతిక అస్తిత్వాలతో కూడిన ఒక సమైక్య దేశం అన్న విషయాన్ని మర్చిపోకూడదు అని కేటీఆర్ సూచించారు. చెన్నైలో జరుగుతున్న డీలిమిటేషన్ సదస్సులో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కేసీఆర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు. మెజార్టీ నియంతృత్వం మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు మా తెలంగాణ ప్రజలకు తెలుసు.. (tyranny of majority) తెలంగాణ ఉద్యమ కాలంలో ఢిల్లీలో ఉన్న మందబలంతో పాటు సమైక్య రాష్ట్రంలోని మెజార్టీ నాయకత్వం పైన పోరాటం చేసి 14 సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నాము. దీనివల్లనే 14 సంవత్సరాలు పట్టింది అనేక ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటాము. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చింది.. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించుకోవడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచి లెక్క పనిచేస్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత డిలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాల వలన దక్షిణాదికి అనేక నష్టాలు జరుగుతున్నాయి. దేశ అభివృద్ధి కోసం పని చేసినందువలన ఈరోజు నష్టం జరుగుతుంది. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు. మందబలం ఉన్నందువలన నియంతృత్వం రావద్దు. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ… దేశాన్ని వెనక్కి నడుస్తున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుంది. పరిపాలన ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి కానీ దానివల్లనే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
దేశానికి 36 శాతం జిడిపిలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయి. డీలిమిటేషన్ అంశం కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదు. ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరగబోతుంది. వీటి కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉన్నది. ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం మరింతగా పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ వివక్ష అన్యాయం మరింత పెరిగింది అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీ లిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులన్ని ఉత్తరాదికే పరిమితం అవ్వడం ఇందుకు ఒక ఉదాహరణ. బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం పైన పుండుపైన ఉప్పురుద్దినట్టుగా వ్యవహరిస్తున్నది. ఆదర్శవంతమైన సమైక్య రాష్ట్ర దేశంలో ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం పైన ఆధిపత్యం చలాయించే విధంగా ఉండరాదన్నది ప్రజాస్వామ్యస్ఫూర్తి . ఇది కేవలం ఉత్తర దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ప్రాంతాలకు నష్టం జరుగుతున్న అంశం అని కేటీఆర్ పేర్కొన్నారు.
వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అంశాన్ని మేము ఏమి వ్యతిరేకించడం లేదు కానీ.. నిధుల కేటాయింపుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 1971 తర్వాత ఉన్న పార్లమెంటు సీట్లు కేటాయింపు తర్వాత జరిగిన జనాభా నియంత్రణ వలన ఈరోజు దక్షిణాదికి నష్టం జరగడం అన్యాయం. జనాభా నియంత్రణను దేశ అభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమైనందువలన వారికి ఈరోజు డీలిమిటేషన్లో లబ్ధి జరగడం ఏ విధంగా కూడా సరైంది కాదు. ఇది దేశాన్ని వెనుక వేసిన వాళ్లకి రివార్డు ఇవ్వడం లాంటిది. దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే 2047 నాటికి సూపర్ పవర్ కావాలి అంటే అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహం లభించాలి కానీ శిక్ష కాదు. డిలిమిటేషన్ అనేది ఆర్థిక అభివృద్ధి పరిపాలన అభివృద్ధి వంటి అంశాల పైన జరగాలి కానీ కేవలం పరిపాలన పైన కాదు. ఈ అంశంలో జరుగుతున్న నష్టం పైన మాట్లాడకుంటే చరిత్ర మనల్ని క్షమించదు. భవిష్యత్తు తరాలు ఈరోజు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.