KTR | రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఐదోసారి బరిలో నిలిచారు. నామినేషన్ దాఖలు కంటే ముందు కేటీఆర్ ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో ఆర్మూర్లో నిర్వహించే రోడ్షోలో కేటీఆర్ పాల్గొననున్నారు. సాయంత్రం కొడంగల్లో నిర్వహించే రోడ్షోలో పాల్గొననున్నారు కేటీఆర్.
2006 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెన్నంటి నడిచారు. మొదటిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేశారు. సమీప ప్రత్యర్థి కేకే మహేందర్రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010 ఉప ఎన్నికల్లో బరిలో నిలిచారు. సమీప ప్రత్యర్ధి కేకే మహేందర్ రెడ్డిపై 68,219 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 జనరల్ ఎన్నికల్లో 53,004 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తిరిగి 2018 ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డిపై 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు.