KTR | హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలనే పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. క్షణం తీరిక లేకుండా, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ, 60 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ 60 రోజుల్లో 30 బహిరంగ సభలు, 70 రోడ్ షోలు, 30కి పైగా ప్రత్యేక ఇంటర్వ్యూలు, 150కి పైగా టెలికాన్ఫరెన్సులు నిర్వహించి రికార్డు సృష్టించారు.
ఈ 60 రోజుల పాటు వేలాది మందితో ముఖాముఖి కార్యక్రమాలు, లక్షలాది మందిని ఉద్దేశించి బహిరంగ సభల్లో ప్రసంగించారు కేటీఆర్. అలా అన్నీ తానై పార్టీ తరపున ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. అంతేకాదు ప్రచారంలోనే పాల్గొంటూ, హ్యాట్రిక్ గెలుపు కోసం వ్యూహరచన చేస్తూ ఎప్పటికప్పుడు పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగారు కేటీఆర్. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో నూతనోత్తేజం నింపారు.
ఇక బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొంటూ గత పది ఏండ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పనితీరు, పదేండ్ల ప్రగతి స్థానాన్ని సమర్థవంతంగా విడమరిచి చెప్పారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మహిళలు, యువత, విద్యావంతులను ఆలోచింపజేసేలా సాగిన కేటీఆర్ ప్రసంగాలు సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున వైరల్ అయ్యాయి. అలాగే అత్యంత కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతను తన భుజాలపై వేసుకుని.. విస్తృతంగా పర్యటించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం రెండు రోడ్ షోలతో పాటు ఎల్బీనగర్ , శేర్లింగంపల్లి , మల్కాజ్గిరి వంటి పెద్ద నియోజకవర్గాల్లో ఒకే రోజు నాలుగు నుంచి ఐదు రోడ్ షోలలో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కేటీఆర్ బిజీగా గడిపారు. అంతేకాదు ఈ బిజీ సమయంలోనూ ఆయా ఛానళ్లకు, రాజకీయ విశ్లేషకులు, ఇతర ప్రముఖులకు కేటీఆర్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. జయప్రకాష్ నారాయణ (జేపీ), గోరేటి వెంకన్న, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారితో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువకులతో కూడా కేటీఆర్ ముచ్చటించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతోపాటు.. ప్రభుత్వ నియామక ప్రక్రియను శరవేగంగా పూర్తిచేసేందుకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. అలాగే ఓలా, ఊబర్, జొమాటోలో సేవలు అందిస్తున్న యువకుల దాకా అన్ని వర్గాల వారితో సంభాషిస్తూ వారికి భరోసానిస్తూ ముందుకు సాగారు. ఇక ఐటీ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలతో పాటు హైదరాబాద్లో ఫస్ట్ టైం ఓటర్లతో కేటీఆర్ సమావేశాలు నిర్వహించారు.
మొత్తంగా గత 60 రోజులపాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానై, స్టార్ క్యాంపెయినర్ గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్ని బాధ్యతలు తన భుజాలపై వేసుకుని రోజుకి దాదాపు 15-18 గంటల వరకు పనిచేశారు కేటీఆర్. ప్రతిరోజు వేలాది మందితో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కేటీఆర్ మాట్లాడారు. ఒకవైపు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ నియమించిన ఇన్చార్జిలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు కేటీఆర్.