KTR | దిలావర్పూర్లో రైతుల దెబ్బకు దిగివచ్చిన సీఎం రేవంత్ రెడ్డి లగచర్లలో కూడా లెంపలేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వెంటనే లగచర్లలో అల్లుడి కోసం.. ఆదానీ కోసం.. ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో పెడుతున్న ఫార్మా, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అమాయకులైన గిరిజనుల భూములను దొంగచాటుగా బలవంతంగా లాక్కునే కుట్రలకు ఇప్పటికైనా తెరదించాలని కేటీఆర్ అన్నారు. అక్కడ శాంతిని నెలకొల్పాలని సూచించారు. ఢిల్లీలో రైతుల సంఘటన శక్తిలో ఉన్న బలం ముందు దేశ ప్రధాని కూడా చివరికి వెనక్కి తగ్గిన చరిత్ర మన కళ్ల ముందు ఉందని తెలిపారు. అనాలోచిత నిర్ణయాలతో మొన్న లగచర్లలో లడాయికి కారణమైన రేవంత్ రెడ్డి.. తన మొండి వైఖరి వల్లే నిన్న నిర్మల్లో ఇథనాల్ మంటలను రాజేశారని పేర్కొన్నారు. తలకు మాసిన ఆలోచనలతో రేపు రేవంత్ ఏ జిల్లాలోని.. ఏ పచ్చని పంట పొలాల్లో ఎలాంటి బాంబు పేలుస్తారోననే భయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరిలో వ్యక్తం అవుతుందని కేటీఆర్ అన్నారు.
ప్రజల అభీష్టం మేరకు నడుచుకోవడం.. వారి మనోభావాలను గౌరవించడం అనేది పాలకుడి ప్రాథమిక విధి అని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ విషయాన్ని గుర్తెరిగి వెంటనే నిర్మల్ తరహాలోనే.. సొంత నియోజకవర్గంలో లగచర్ల సమరానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. తప్పు ఒప్పుకుని వెనక్కి తగ్గినంత మాత్రాన సీఎం రేవంత్ రెడ్డి కిరీటం ఏమీ పడిపోదని విమర్శించారు. లేకపోతే జరిగే పరిణామాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.