KTR | హైదరాబాద్ : ఇవాళ పోటీ ఎవరెవరికి జరుగుతుందంటే.. పదేండ్ల నిజానికి, వంద రోజుల అబద్దానికి, మరో పదేండ్ల విషానికి.. ఈ మూడింటి మధ్యనే పోటీ జరుగుతున్నది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పదేండ్ల నిజం బీఆర్ఎస్.. పదేండ్ల విషం బీజేపీ, వందరోజుల అబద్దం కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మహాలక్ష్మి కింద మహిళలకు డబ్బులు ఇస్తా అన్నాడు.. బంగారం ఫ్రీ అన్నాడు. ఇవాళ ఏమి ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి. రైతులు పొల్లుపొల్లు తిడుతున్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానన్నాడు. మార్చి 9 పోయి.. ఏప్రిల్ 9 రావట్టే. కానీ రుణమాఫీ లేదు. రైతుబంధు రాదు. కరువు వచ్చింది.. కనీసం మంత్రులు ఊర్లలోకి పోవడం లేదు. కనీసం అధికారులు పంట నష్టం అంచనా వేసి పరిహారం ఇవ్వమంటే ఇవ్వట్లేదు. వంద రోజుల అబద్దం రేవంత్ రెడ్డి పాలన. ఏ ఒక్క పని చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల్లో ఆల్రెడీ చర్చ ప్రారంభమైంది. వారిలో మంట ఉన్నది. ఆటో డ్రైవర్లు కూడా కోపంగా ఉన్నారు. కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి రేవంత్ మోసం చేస్తున్నాడని యువకులు ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ తెలిపారు.
అదే విధంగా పెద్ద మనషులకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవ్వట్లేదు. దీంతో వృద్ధులు రగిలిపోతున్నారు. ఒక్క వర్గాన్ని కూడా ఈ ప్రభుత్వం సంతోష పరచలేదు. హైదరాబాద్లో బీఆర్ఎస్ను గెలిపించినా కూడా అధికారంలోకి దగ్బులాజీ ప్రభుత్వం వచ్చిందని హైదరాబాదీలు బాధపడుతున్నారు. మరోసారి మన పార్టీ సత్తాను చూపించే సమయం వచ్చింది. దయచేసి సీరియస్గా తీసుకొని పని చేయాలి అని కేటీఆర్ సూచించారు.