KTR | రంగారెడ్డి : శ్రీరాముడితో మనకు పంచాయితీ లేదు.. ఎందుకంటే రాముడు అందరివాడు.. బీజేపీ వ్యక్తి కాదు. రాముడికి బరాబర్ మొక్కుదాం.. కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం.. ఓడిద్దాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భువనగిరి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపోళ్లకు ఎందుకు ఓటేయాల్నో నాకు తెల్వదు. 10 ఏండ్లలో అన్ని పిరం చేశారు మోదీ. ఇవాళ దేశంలో మోదీని ప్రియమైన ప్రధాన మంత్రి అంటలేరు.. పిరమైన ప్రధాని అంటున్నారు. మోదీకి ఎందుకు ఓటేయాలి..? మన ఐదు మండలాలను గుంజుకున్నందుకా..? భద్రాద్రి రామున్ని పట్టించకోనందుకా..? కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనుందుకా..? పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయో హోదా ఇవ్వనందుకా..? ఐటీఐఆర్ రద్దు చేసినందుకా..? నవోదయ పాఠశాలలు, మెడికల్ కాలేజీలు ఇవ్వనందుకా..? ఎందుకు ఓటు వేయాలి. ఈ పదేండ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పి ఓటు అడగాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తామంటే వారి నిజస్వరూపం బయటపెట్టాలి. మనం యాదాద్రిని ఎంతో అద్భుతంగా నిర్మించాం. కానీ యాదాద్రిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టాలి. మోదీ దేవుడని బండి సంజయ్ అంటడు. పెట్రోల్, డిజీల్ ధరలు పెంచినందుకు మోదీ దేవుడా..? మోదీ వల్లే దేశానికి భద్రత అంటడు బండి సంజయ్. ఎవరున్న ఈ దేశానికి ఇబ్బంది లేదు. కేంద్రంలో మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. మీ ఆశీర్వాదంతో 12 సీట్లు ఇస్తే మనమే చక్కం తిప్పే పరిస్థితి రావొచ్చు. మన గొంతు వినబడాలంటే పార్లమెంట్లో మనోడు ఉండాలని కేటీఆర్ అన్నారు.