KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు భరోసా ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అబద్దాలు చెప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక పైన పచ్చి అబద్దాలు చెప్పారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతామని మంత్రులు అంటున్నారు. లేని రైతు భరోసా గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. రేవంత్ రెడ్డి 45 రోజుల్లో సాధించింది ఢిల్లీ పర్యటనలు మాత్రమే. తెలంగాణ పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతుంది. సీఎంకు కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకో ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేలా వెంటపడుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎంపీ స్థానాల వారిగా నిర్వహించిన సమావేశాలు విజయవంతం అయ్యాయని కేటీఆర్ తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలు మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. త్వరలో 30 వేల మంది సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తాం. స్వల్ప ఓట్ల తేడాతో 14 అసెంబ్లీ స్థానాలను కోల్పోయాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై స్వల్ప కాలంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ చెప్పిన మాటలను ప్రతిపక్షంగా గుర్తు చేస్తున్నాం. కేసీఆర్పై కుట్ర పన్నేందుకు 2 జాతీయ పార్టీలు ఏకమయ్యాయి. అందులో భాగంగానే ఆదానీతో రేవంత్ రెడ్డి జత కట్టారు. ఆదానీ సంస్థలతో ఇప్పుడు ఎలా ఒప్పందాలు చేసుకున్నారు..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
దుబాయ్ జైల్లో మగ్గుతున్న నలుగురు సిరిసిల్ల వాసులు త్వరలో విడుదలవుతారని కేటీఆర్ తెలిపారు. 2009 నుంచి వారి విడుదల కోసం ప్రయత్నిస్తున్నాను. 17 ఏండ్ల తర్వాత నలుగురు సిరిసిల్ల వాసులు రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు.