KTR | హైదరాబాద్ : తెలంగాణ కోసం పుట్టిన గులాబీ పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకోవడం చిన్న విషయం కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు.
ఉద్యమకారులు గొప్ప పరిపాలకులు కాలేరు అని అరుణ్ జైట్లీ అన్నారు.. కానీ ఆ మాట తప్పని కేసీఆర్ నిరూపించారని కేటీఆర్ గుర్తు చేశారు. 14 సంవత్సరాల పాటు ఉద్యమం చేసి తెలంగాణ సాధించారు. పదేండ్లు అధికారంలో ఉండి తెలంగాణకు సేవ చేశాం. కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల్లోనే తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కరెంటు కోతలు, తాగునీటి కష్టాలు లేని కేసీఆర్ పరిపాలనే మళ్లీ కావాలని అనుకుంటున్నారు. గ్రామాల్లో మార్పు మొదలైందని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ నగరం సంపూర్ణంగా బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలను పూర్తిగా తిరస్కరించింది. ఈ ప్రభుత్వానికి మైనార్టీలను గౌరవించే సంస్కారం లేదు. కనీసం ఒక మంత్రి పదవి కూడా వాళ్లకు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నాడు..? మోడీ నాయకత్వంలోనా..? రాహుల్ గాంధీ నాయకత్వంలోనా..? రేవంత్ రెడ్డి కచ్చితంగా బీజేపీలో చేరతాడు. ఇప్పటికి 20 సార్లు నేను ఈ మాట చెప్పిన సరే ఆయన కనీసం ఎందుకు స్పందించటం లేదని కేటీఆర్ అడిగారు.
లోక్ సభ సీట్ల కేటాయింపులో బీఆర్ఎస్ సామాజిక సమతూకాన్ని పాటించింది. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం సామాజిక సమతూకం పాటించడంలో విఫలమయ్యాయి. అందుబాటులో ఉన్న 12 సీట్లలో ఆరు సీట్లు అంటే 50 శాతం బీసీలకే కేటాయించాం. మా పార్టీ కేటాయించిన సీట్లతో సుదీర్ఘకాలం ఉద్యమం చేసిన నాయకులతో పాటు పార్టీకి పనిచేసిన నాయకులు, బీసీలు, దళితులు, గిరిజనులు ఇలా అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.