KTR | హైదరాబాద్ : మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటదని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
ఈటల రాజేందర్.. హుజురాబాద్, గజ్వేల్లో ఓడిపోయి.. ఇక్కడ టికెట్ తెచ్చుకున్నాడు. మేడ్చల్లో రాజేందర్ మాట్లాడుతూ రైతులపై ప్రేమ కురిపించాడు. 2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటాను అని కాంగ్రెస్ సర్కార్కు సవాల్ విసిరాడు. ఆయన టీఆర్ఎస్లో ఉన్నా అనుకుంటున్నాడు. బీజేపోళ్లు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటది. మోదీ 10 ఏండ్లలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు. ఎవరివి అంటే.. బడా బడా బాబులు, కార్పొరేట్ సేట్లు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, అదానీ, అంబానీల రుణాలు మాఫీ చేసిండు. అలాంటి పార్టీలో కూర్చొని రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా చండాలంగా, దరిద్రంగా ఉందని ఈటల రాజేందర్పై కేటీఆర్ విరుచుకుపడ్డారు.
దమ్ము, ధైర్యం ఉంటే.. మోదీ ప్రభుత్వం కంటోన్మెంట్, మల్కాజ్గిరికి ఏం చేసిందో చెప్పి ఓటు అడుగు. ఈ పదేండ్లలో ఏం చేసిండ్రు అనిగట్టిగా అడిగితే జై శ్రీరాం అంటున్నరు. అది తప్ప ఏం లేదు. ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో 11,560 కోట్ల రూపాయాలు ఇవాళ బీజేపీ ఖాతాలో ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఒకాయన వద్ద రూ. 60 కోట్లు తీసుకొని బయటకు పంపింది వాస్తవం కాదా..? మోదీ నీతిమంతుడు అని అంటున్నారు. ఎందుకు నీతిమంతుడు 609 స్థానంలో ఉన్న అదానీని 2 స్థానంలో కూర్చోబెట్టినందుకా మోదీ నీతిమంతుడా..? అని ప్రశ్నించారు కేటీఆర్.
బీజేపోళ్లు గోస ముఖం పెట్టంగానే ఆగం కాకండి. రాజేందర్ మంచి డైలాగులు కొడుతారు. హుజురాబాద్లో సాదుకుంటారా.. సంపుకుంటారా అని డైలాగులు వేశారు. ఓటు వేసిన పాపానికి హుజురాబాద్ను మళ్లీ చూడలేదు. రాగిడి లక్ష్మారెడ్డికి రాజేందర్లాగా సీనియార్టీ లేకపోయినా.. సీన్సియారిటీ ఉంది. కాంగ్రెస్, బీజేపీల నుంచి పోటీ చేస్తున్న ఆ ఇద్దరు కేసీఆర్ వద్ద పదవులు పొంది వెన్నుపొటు పొడిచి పోటీలో నిలబడ్డారు. కష్టకాలంలో కేసీఆర్ వెంట నడుస్తున్నా లక్ష్మారెడ్డిని గెలిపించాలి. ఇక్కడ లక్ష్మారెడ్డి కాదు.. కేసీఆర్ నిలబడ్డారు అని గెలిపించాలి అని కేటీఆర్ పేర్కొన్నారు.