Telangana | భీమ్గల్, డిసెంబర్ 1: ఎన్నికల్లో డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నావని, నీ అంతు చూస్తానని బీజేపీ నాయకులు బెదిరించడంతో బీఆర్ఎస్ కార్యకర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మం డలం బెజ్జోరా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు తునిగండ్ల రాజాగౌడ్ (45) బుధవారం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు ఈర్ల లక్ష్మీప్రసన్న, నర్సు, మధు, మహేందర్ అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు రాజాగౌడ్పై ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు చేయడంతోపాటు చంపుతామని బెదిరించారు.
మనస్తాపానికి గురైన రాజాగౌడ్ గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గ్రామ శివారులోని దేవి ఆలయ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు బీజేపీ నాయకుల ఇంటి ముం దు మృతదేహంతో శుక్రవారం ధర్నాకు దిగారు. సుమారు మూడు గంటలపాటు ఆందోళన చేశా రు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాజాగౌడ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై హరిబాబు తెలిపారు.