Minister KTR | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో 70కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించబోతున్నదని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్పోల్స్ ఫలితాలు చూసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహపడొద్దని, అవన్నీ కల్పితాలేనని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్లోనే నిలబడి ఉన్నారని, పోలింగ్ పూర్తి కాకుండానే ఎగ్జిట్పోల్స్ ఫలితాలు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. 2018లోనూ ఎగ్జిట్పోల్స్ ఫలితాలు ఇచ్చారని, 5 ఎగ్జిట్పోల్స్లో ఒక్కటి మాత్రమే కరెక్ట్ అని, మిగిలిన నాలుగు తప్పేనని చెప్పారు. 2018లో బీఆర్ఎస్కు 48 సీట్లు వస్తాయని ఒక ఎగ్జిట్పోల్ చెప్తే, 50 సీట్లు గెలుస్తారని మరొకరు, 52 వస్తాయని ఇంకొకరు, 66 సీట్లు వస్తాయని వేరొకరు చెప్పారని, అవన్నీ తప్పయ్యాయని గుర్తు చేశారు. అప్పట్లో ఎగ్జిట్పోల్స్ తప్పని నిరూపిస్తూ బీఆర్ఎస్కు 88 సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ 69-72 స్థానాల్లో విజయం సాధిస్తుందని తనకు కూడా ఒకరు ఎగ్జిట్పోల్స్ ఫలితాలు పంపారని, తాను దాన్ని కూడా అంగీకరించనని చెప్పారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తికాకుండానే ఎగ్జిట్పోల్స్ ఫలితాలకు అనుమతి ఎలా ఇస్తారని ఎన్నికల సంఘం సీఈవోను అడిగామని, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని చెప్పారని, కానీ.. అది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఈ ఎగ్జిట్పోల్స్ ఓటర్లను ప్రభావితం చేసినట్టు కాదా? ఓటింగ్ ప్రక్రియ ముగిసేదాకా ఎగ్జిట్పోల్స్ను ఆపాలి కదా? అని ప్రశ్నించారు.
ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ను గతంలోనూ చూశామని, ఎగ్జిట్పోల్స్ తప్పని నిరూపించడం తమకు కొత్తేమీ కాదని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ సమాజానికి ప్రామిస్ చేస్తున్నానని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని తెలిపారు. తాము 88 సీట్లు వస్తాయని ఆశించామని, కానీ కొన్నిచోట్ల చిన్న చిన్న ఆటంకాలు రావడంతో కొన్ని సీట్లు తగ్గుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఆ సీట్లు ఎందుకు తగ్గుతాయని అనుకుంటున్నామో డిసెంబర్ 3న చెప్తామని అన్నారు. ‘ఎగ్జిట్పోల్స్ను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని మీడియా సంస్థలు సర్వేలు చేయకుండా.. ఏదో 200 మందిని అడిగినట్టు చేసి.. దాన్నేదో రాకెట్సైన్స్ మాదిరిగా గొప్పగా చేసి చూపిస్తారు. గతంలో ఇవే 5 జాతీయ మీడియా సంస్థలు సర్వేలు చేస్తే.. అందులో ఒకటే నిజమైంది. ఎగ్జిట్పోల్స్ పేరుతో న్యూసెన్స్, నాన్సెన్స్ క్రియేట్ చేసేవాళ్లకు చెబుతున్నాను. డిసెంబర్ 3న ఫలితాలు చూడండి. మీ ఫలితాలు తప్పని మీకే తెలుస్తుంది. మీ ఎగ్జిట్పోల్స్ తప్పయితే డిసెంబర్ 3న తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్తారా?’అని ప్రశ్నించారు. ఒకపక్క ఓటింగ్ జరుగుతుంటే.. ఎగ్జిట్పోల్స్ ఇవ్వడమంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదని పేర్కొన్నారు. ఎగ్జిట్పోల్స్ చెప్పేటప్పుడు సంచలనాలే కాదని, సంస్థల క్రెడిబిలిటీ గురించి కూడా ఆలోచించాలని హితవు పలికారు.
ఎన్నికలు అనగానే సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈసారి అది మరింత శ్రుతి మించిందని కేటీఆర్ మండిపడ్డారు. అనని మాటలను అన్నట్టు క్రియేట్ చేస్తున్నారని, లేనిది ఉన్నట్టు చూపిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. ఎగ్జిట్పోల్స్పైనా సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారమే జరుగుతున్నదని చెప్పారు. ఎన్నికల సంఘం ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదని కోరారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. రూరల్ ఏరియాతో పోలిస్తే అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్నదని తెలిపారు. ఇది ఒక్క హైదరాబాద్కే పరిమితం కాదని, దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరుతోపాటు మిగిలిన నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నదని చెప్పారు. ఎగ్జిట్పోల్స్ వందశాతం తప్పని తానేమీ అనడం లేదని, కానీ.. 80 శాతం తప్పేనని అభిప్రాయపడ్డారు.
ఓటింగ్శాతం తగ్గితే రూలింగ్ పార్టీకి లాభం, పెరిగితే రూలింగ్ పార్టీకి నష్టమనే అభిప్రాయంతో తాను ఏకీభవించనని చెప్పారు. ఓటింగ్ శాతం పెరిగినా, తగ్గినా ఫలితాలు తమకే అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పోలింగ్ శాతం పూర్తిగా వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. ఎవరూ గందరగోళానికి గురికావద్దని, ఎగ్జిట్పోల్స్ చూసి కంగారు పడొద్దని, వందకు వందశాతం రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. బీఆర్ఎస్ విజయం కోసం కృషిచేసిన కార్యకర్తలు, నాయకులు, ఓటింగ్ ప్రశాంతంగా జరగడానికి నిబద్ధతతో పనిచేసిన పోలీసులు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఓటమి ఖాయం కావడంతో కాంగ్రెస్ పార్టీ చిల్లరగాళ్లు పోలింగ్నాడు మరో ఫేక్ వీడియో ప్రచారం మొదలుపెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు.‘ఒరేయ్.. చిన్న పిల్లాడు కూడా ఆ వీడియోను చూసిన వెంటనే ఫేక్ అని చెప్పేస్తాడు. డిసెంబర్ మూడోతేదీ వరకు ఆగాల్సిన పనిలేదు. వందేళ్లకు పైబడి చరిత్ర ఉన్న మీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్పై ఈ చిల్లర డీప్ ఫేక్ వీడియో వేసినప్పుడే మీ ఓటమి ఖాయమైంది.’ అని ఎక్స్ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎంత దౌర్భాగ్యపు పార్టీనో తెలంగాణ ప్రజలకు అర్థమైందని, చైతన్యవంతులైన ఓటర్లు ఓటుతోనే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత గింజుకున్నా కేసీఆర్ విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు.