షాబాద్, ఆగస్టు 25: వచ్చే ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలుపొంది బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని మంత్రులు శ్రీనివాస్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంత్రులు కుల వృత్తిదారులకు లక్ష సాయం చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుల సంఘాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. గతంలో 11సార్లు అధికారం ఇస్తే రాష్ర్టాన్ని దివాలా తీసేలా చేసిన ఘనత ఆ పార్టీలదేనని ఆరోపించారు. రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని వ్యాఖ్యలు చేసిన నాయకులకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు.