హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారని కవిత తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ ముంబై యూనిట్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ముంబై ఎయిర్పోర్టు సమీపంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో కూడా తెలంగాణ మోడల్ పాలనను అమలు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు దాదాపు 1000 కిలోమీటర్ల మేర ఉంది. కానీ రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంలో చాలా తేడా ఉందన్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. కానీ మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో మాత్రం రెండు గంటలే తాగునీటిని సరఫరా చేస్తున్నారని కవిత గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేయగలిగినప్పుడు.. మహారాష్ట్ర ప్రభుత్వం అలాంటి కార్యక్రమాన్ని ఎందుకు అమలు చేయడం లేదని కవిత ప్రశ్నించారు. ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్ అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. ఈ రెండు సమస్యలను తెలంగాణ ప్రభుత్వం 98 శాతం పరిష్కరించిందని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని కవిత పేర్కొన్నారు. మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని కవిత స్పష్టం చేశారు.