Minister Gangula | తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90కిపైగా సీట్లను గెలిచి.. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 సీట్లకు 13 స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. మా ఇంటి ముందు రోడ్డు లేదని ఎవరడిగినా తక్షణమే మంజూరు చేస్తామన్నారు. ఇందుకోసం రూ.25 కోట్ల నిధులను బఫర్ కింద పెట్టుకున్నామన్నారు. మరో రూ.125 కోట్లతో నగరంలోని మిగిలిపోయిన మేయిన్ రోడ్లన్నీ నిర్మూస్తున్నామని చెప్పారు.
ప్రతిపక్షాలకు ఏ సబ్జెక్టు లేక గృహలక్ష్మి, బీసీబంధు పథకాలపై రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. గృహలక్ష్మి, బీసీబంధు పథకాలు నిరంతర ప్రక్రియ అని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయ అనుభవం లేని కొందరు అజ్ఞానులు చేసే విమర్శలకు తాను స్పందించనన్నారు. ఎన్నికల ముందు వచ్చి వచ్చి పిచ్చిమాటలు మాట్లాడేవాళ్లంతా.. ఎన్నికలయ్యాక మళ్లీ కనుమరుగవుతారన్నారు. ఇలాంటితో ట్ల కరీంనగర్ ప్రజలు జాగ్రత్త ఉండాలని పిలుపునిచ్చారు. నమ్మి అధికారమిస్తే దోచుకునేందుకు కాచుకు కూర్చున్నారన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, సురక్షితంగా ఉన్న నగరంలో అశాంతి కోసం ప్రయత్నిస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొందరు తనను తిట్టి వాళ్ల పార్టీలో పాపులారిటీ పొందాలని భావిస్తున్నారన్నారు. వక్ఫ్ బోర్డు భూములపై ప్రతి ఎన్నికల సమయంలో తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎమ్మెల్యే కాకముందు 2008లోనే అన్ని రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాతే భూములు కొనుగోలు చేశానని స్పష్టం చేశారు. త్వరలోనే ఎవరూ ఉహించని విధంగా బీఆర్ఎస్లో చేరికలుంటాయన్నారు.