హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): 90వ దశకం నుంచి పాపులర్ అయిన ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ యాడ్ మీకు గుర్తుందా..? ‘వాషింగ్ పౌడర్ నిర్మా.. పాలలోని తెలుపు నిర్మాతో వచ్చిం ది.. రంగూల బట్టలే తళతళ మెరిశాయి’ అంటూ వచ్చే జింగిల్ అడ్వర్టయిజింగ్ రంగంలోనే ఓ ఊపు ఊపేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఈ యాడ్ మళ్లీ మార్మోగుతున్నది. గుర్తు తెలియని వ్యక్తులు ‘వాషింగ్ పౌడర్ నిర్మా.. వెల్కం టు అమిత్షా’ అంటూ నగరవ్యాప్తంగా హోర్డింగులను ఏర్పాటు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బీజేపీలో చేరితే కేసులన్నీ మాయమైపోతాయనేది ఈ హోర్డింగ్లోని వ్యంగ్యం. నిర్మా యాడ్లో కనిపించే అమ్మాయి తల ప్లేస్లో బీజేపీ నేతలు హిమంత బిశ్వశర్మ, నారాయణ్రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి, విరూపాక్షప్ప, ఈశ్వరప్ప, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ ఖోట్కర్ ఫొటోలను ఉంచారు. వీరిలో ఎక్కువమంది అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొన్న తర్వాత బీజేపీలో చేరినవారే.
అవినీతిపరులు.. ఆ పార్టీలో చేరితే పునీతులా?
బీజేపీ సర్కారు ప్రతిపక్షంలోని నాయకులను వేధించేందుకు, వారిపై ఒత్తిడి తెచ్చేందుకు సీబీఐ, ఈడీ, ఐటీలాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని విపక్షం విమర్శిస్తున్నది. అవినీతి ఆరోపణలపై సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొన్న నాయకులు బీజేపీలో చేరగానే దర్యాప్తు సంస్థలు సైలెంట్ అయిపోవడం, వారికి సమన్లు ఆగిపోవడం విపక్షాల విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఉదాహరణకు 2015లో లూయిస్ బర్గర్ స్కామ్లో హిమంత బిశ్వశర్మ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కేంద్రం ఆయనపై ఈడీ విచారణకు ఆదేశించింది. అనంతరం హిమంత బీజేపీలో చేరారు. అస్సాంకే సీఎం అయిపోయారు. ఆయనపై ఈడీ విచారణ కొనసాగుతున్నదా? విచారణ ముగిసిందా? ఇది ఈడీ చెప్పాలి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, ఎమ్మెల్యే సువేందు అధికారి కూడా శారదా స్కాంలో విచారణ ఎదుర్కొన్నారు. 2020లో బీజేపీలో చేరారు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్కుమార్ రూ.40 లక్షలు లంచం తీసుకొంటూ రెడ్హ్యాండెడ్గా దొరికినా అతడికి ఈడీ నోటీసులు రాలేదు. లోకాయుక్త జరిపిన సోదాల్లో రూ.8 కోట్లు దొరికినా ఈడీ కన్నెత్తి చూడలేదు. ఇలాంటివి గుర్తుచేస్తూ.. బీజేపీ బాగోతం ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో అమిత్ షా పర్యటన వేళ హైదరాబాద్లో ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ హోర్డింగులు వెలిశాయి.