నారాయణఖేడ్, జనవరి 30: కర్ణాటక రాష్ట్రం బీదర్లో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, మంత్రి హరీశ్రావు సూచనల మేరకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ పార్టీ పుంజుకుంటున్నది. భూపాల్రెడ్డి వరుస పర్యటనలు చేస్తూ, బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను వివరిస్తుండటం సత్ఫలితాలిస్తున్నది. అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు.
ఆదివారం రాత్రి బీదర్ జిల్లా కేంద్రంలో ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మన్సూర్ అహ్మద్ ఖాద్రీతో పాటు మరికొందరు మైనార్టీ నేతలు సహా మొత్తం 300 మంది భూపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారు స్వయంగా ఎమ్మెల్యేను బీదర్కు ఆహ్వానించడమే కాకుండా పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో చేరడం విశేషం. మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి బీదర్లోని ప్రసిద్ధ చౌబారా నుంచి ఫ్రూట్ మార్కెట్లోని సభా వేదిక వద్దకు బ్యాండ్మేళాలు వాయిస్తూ, పటాకులు కాల్చుతూ ఊరేగింపుగా తీసుకెళ్లారు.