దామరచర్ల, జూన్ 12 : ‘మా ప్రాణాలు పణంగా పెట్టి యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం’ అని బీఆర్ఎస్ నాయకులు స్పష్టంచేశారు. వైటీపీఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దామరచర్ల మండలం వీర్లపాలెంలోని ప్లాంట్ వద్ద శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణను మిగులు విద్యుత్తు రాష్ట్రంగా నిలిపేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీపీఎస్ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాసర్రావు ఈ ప్లాంట్ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.
దేశంలోనే అతిపెద్ద పవర్ప్లాంట్ను ప్రైవేట్కు అప్పగిస్తే స్థానికుల ఉద్యోగాల సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇంకా 700మందికి ఉద్యోగాలు రావాల్సి ఉన్నదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణకు ఒప్పుకోమని, టెండర్లను రద్దుచేసే వరకు ప్రభావిత గ్రామస్తులతో కలిసి ఆందోళ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వీరకోటిరెడ్డి, ఎండీ యూసూఫ్, సోము సైదిరెడ్డి, కందుల నాగిరెడ్డి, వినోద్నాయక్, కొనకంచి సత్యనారాయణ, రాయికింది సైదులు, వీరబాబు, బైరం గోపి, కొండారపు నాగేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేయాలని కోరుతూ ప్లాంటులోని ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణను మిగులు విద్యుత్తు రాష్ట్రంగా చేసేందుకు ఏర్పాటు చేసిన వైటీపీఎస్ను ఉద్యోగుల కొరతను సాకుగా చూసి ప్రైవేటీకరణ చేయడం సరికాదని మండిపడ్డారు. స్థానికులు ప్రైవేటీకరణకు వ్య తిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించి వెంటనే టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలని, లేకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.