హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదనే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, ఈ మేరకు ఆయన ‘రైతుబంధు భరోసా పత్రం’ తన ద్వారా విడుదల చేయించారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ చెప్పారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్లో ‘రైతుబంధు భరోసా పత్రం’ విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కయిన రేవంత్రెడ్డి తెలంగాణ రైతుల నోట్లో మన్ను కొడుతూ రైతుబంధును నిలిపివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరైతుల జీవితాలతో కాంగ్రెస్ ఆటలాడుతున్నదని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారాయని విమర్శించారు. వ్యవసాయం దండగా అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండుగ అనే స్థాయికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని, అందుకు రైతులకు ఇచ్చిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఊతమిచ్చాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే పేద రైతులకు కేసీఆర్ అండగా ఉన్నారని చెప్పారు.
కేసీఆర్ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు రైతుబంధు ఆగదని, రైతులకు ఉచిత కరెంటు ఇస్తారని, కల్తీలు లేని వ్యవసాయాన్ని మన రైతులు త్వరలోనే చూడబోతున్నారనేది సీఎం కేసీఆర్ మాటగా దాసోజు శ్రవణ్ చెప్పారు. తెలంగాణ రైతులంతా ఈ విషయంపై ఆలోచించి కాంగ్రెస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. రైతుల అభ్యుదయవాది కేసీఆర్ అని చెప్పారు. పేద రైతుల జీవితాలు బాగుపడుతుంటే.. రేటెంతరెడ్డి ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తెప్పించి రైతుబంధును ఆపి, పేద రైతుల నోటికాడ ముద్దను లాక్కున్నారని విమర్శించారు.
రైతుబంధుకు పూర్తిగా ఎసరు పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ది రైతుది పేగుబంధమని చెప్పారు. ఓట్ల కోణంలో రైతుబంధును ఆపించిన కాంగ్రెస్ ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు చెప్పారు. రైతుల్లో నెలకొన్న అభద్రతను తొలగించేందుకు, రైతుల్లో భరోసా కల్పించేందుకు ‘రైతుబంధు భరోసా పత్రం’తో సీఎం కేసీఆర్ అన్నదాతలకు హామీ ఇచ్చారని, ఈ పత్రంపై ఆయనే సంతకం పెట్టి రైతుల్లో ధైర్యం నింపారని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ సోమా భరత్ పాల్గొన్నారు.