ఖలీల్వాడి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్తోనే కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమంటే బీసీల ప్రభుత్వమని, బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. గతంలో పని చేసిన ప్రభుత్వాలు బీసీలను, కుల వృత్తులను నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. కుల గణన చేయాలంటున్న రాహుల్గాంధీ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆరేనని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన గౌడ, నాయీబ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తాతో కలిసి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. బీసీల ప్రభుత్వం అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మంది బీసీ బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నామని తెలిపారు. తొమ్మిదేండ్లలో ఎంతో పనిచేశాం కాబట్టే హక్కుగా ప్రజల వద్దకు వస్తున్నామని చెప్పారు. ఎన్నికలప్పుడు అనేక పార్టీలు వస్తాయని, బీసీల కోసం గతంలో ఏంచేశారో వారిని నిలదీయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
గౌడ కులస్థులకు అండగా కేసీఆర్
తెలంగాణ ఏర్పాటైతే గౌడ కులస్థులకు అండగా ఉంటామని కేసీఆర్ ఆనాడే చెప్పారని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. అందుకు అనుగుణంగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం పాలసీగా తీసుకుని ఈత వనాలను పెంచుతున్నదని తెలిపారు. మద్యం టెండర్లలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించిందని వివరించారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గీతకార్మికులకు ఇంకా ఏమైనా సమస్యలుంటే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని కవిత హామీ ఇచ్చారు.
సెలూన్లకు ఉచిత విద్యుత్తు
రాష్ట్రంలోని హెయిర్ సెలూన్లకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నది కేవలం కేసీఆర్ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నాయీబ్రాహ్మణులు అశ్విని దేవతల వారసులని పేర్కొన్నారు. నాయీబ్రాహ్మణులు లేకుంటే సమాజానికి ఎంతటి ఇబ్బంది ఉంటదో సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారని, కులవృత్తిని కాపాడేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 35 వేల సెలూన్లకు సబ్సిడీ విద్యుత్తు అందిస్తున్నారని వివరించారు. 12 లక్షల కల్యాణలక్ష్మి లబ్ధిదారులు ఉంటే, అందులో 7 లక్షల మంది బీసీలేనని తెలిపారు. 60 ఏండ్లు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో బీసీ గణన ఎందుకు చేయలేదో రాహుల్గాంధీ సమాధా నం చెప్పాలని నిలదీశారు. దేశంలో ఉన్న బీసీలకు న్యాయం జరగాల్సిందేనని అన్నారు. కేసీఆర్ మీద అభిమానంతో రెండుసార్లు ఆశీర్వదించి గెలిపించారని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బీమాతో గీత కార్మికులకు ధీమా
రాష్ట్రం ఏర్పడ్డాక కులవృత్తుల వారికి సీఎం కేసీఆర్ అండగా నిలిచారని ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్తా తెలిపారు. గీత కార్మికులకు ఆసరా పింఛన్లతోపాటు గీతకార్మిక బీమా అమలు చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ధీమా కల్పిస్తున్నదని పేర్కొన్నారు. గీత వృత్తిని నమ్ముకున్న వారి ఆర్థికవృద్ధి కోసం ప్రభుత్వం హైదరాబాద్లో నీరా కేఫ్లు ఏర్పాటు చేసిందని తెలిపారు. నిజామాబాద్లో కూడా నీరాకేఫ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. నాయీబ్రాహ్మణులకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించామని చెప్పారు. తనను ఎమ్మెల్యేగా, కవితక్కను ఎంపీగా గెలిపిస్తే మరింత సేవ చేస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.