హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగలను తలపిస్తున్నాయి. డప్పు చప్పుళ్లు, బోనాలు, బతుకమ్మలతో మహిళా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బైక్ ర్యాలీలో యువకులు సందడి చేస్తున్నారు. ఆయా ప్రాంగణాలు గులాబీ తోరణాలతో కళకళలాడుతున్నాయి. పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని గమనించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ను పొడిగించారు. వచ్చే నెల 20 వరకు కాకుండా మే చివరి దాకా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
మంగళవారం 25 నియోజకవర్గాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బీ ప్రకాశ్, మంత్రులు ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, పువ్వాడ అజయ్కుమార్, ప్రభుత్వ విప్లు ఏ గాంధీ, గువ్వల బాలరాజు, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి మందా జగన్నాథంతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనానికి హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఉద్విగ్నంగా ప్రసంగించారు. పార్టీ శ్రేణుల ఉత్సాహం చూస్తుంటే ఉద్యమకాలం నాటి సన్నివేశాలు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. కార్యకర్తలను చూస్తుంటే బీఆర్ఎస్ది ఎంత పెద్ద బలగమో స్పష్టం అవుతున్నదని పేర్కొన్నారు.
కార్యకర్తకు ఆపదొస్తే బీఆర్ఎస్ గొడుగై నీడనిస్తుందని మహబూబ్నగర్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ అభయం ఇచ్చారు. కార్యకర్తలు ఏ సమయంలో ఫోన్చేసినా అందుబాటులో ఉంటామన్నారు. కార్యకర్తలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ సరికొత్త చరిత్ర నిర్మించనున్నారని, అందుకు వారధులుగా పనిచేసే అదృష్టం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దక్కిందని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. దేశం మొత్తం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నదని చెప్పారు.
ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి బలపర్చగా, పార్టీ శ్రేణులు ఆమోదం తెలిపాయి.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి దయాకర్రావు ఆవిష్కరించారు. ఇక చేపట్టాల్సిన పనులపై అభిప్రాయ సేకరణ చేశారు.
మోదీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే తెలంగాణపై కక్షగట్టారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మోదీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడని మండిపడ్డారు. ప్రధాని అవినీతిని సీఎం కేసీఆర్ ప్రశ్నించినందుకే తెలంగాణపై కక్షకట్టారని, తప్పుడు కేసులతో ఎమ్మెల్సీ కవితను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్, రాహుల్గాంధీ ప్రధాని పదవికి పోటీకి వస్తారనే భయంతోనే మోదీ ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల ప్రసంగించారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. ‘మోదీ ప్రధాని అయ్యే నాటికి అదానీ ఆస్తి రూ.50 వేల కోట్లు ఉండే. 8 ఏండ్లలో 12 లక్షల కోట్లకు చేరింది. బ్యాంకు రుణాలను కేంద్రం మాఫీ చేయడం వల్లే అదానీ ఆస్తి పెరిగింది. అదానీ కారణంగా ఎల్ఐసీకి రూ.60 వేల కోట్లు, ఎస్బీఐకి రూ.70 వేల కోట్ల నష్టమొచ్చింది. ఇదంతా ప్రజల డబ్బుకాదా? ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నించినందుకే మోదీ తెలంగాణపై కక్ష కట్టిండు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు’ అని మంత్రి వేముల ధ్వజమెత్తారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ విస్తృతంగా చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనాలు మే నెలాఖరు వరకు నిర్వహించుకోవచ్చని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు తెలియజేశారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ కార్యక్రమాలను విస్తృతంగా, సమగ్రంగా, కూలంకషంగా నిర్వహించుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో మే నెలాఖరు వరకు నిర్వహించుకొనేందుకు అవకాశం కల్పించారు. గడువు మరింతగా పెంచిన నేపథ్యంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు మరింత సావకాశంగా నిర్వహించుకొనే వీలు కలుగుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకోవాలని పార్టీ నియమించిన జిల్లా ఇన్చార్జీలను కేటీఆర్ ఆదేశించారు.
మునుపు నీళ్ల కోసం మస్తు తిప్పలు పడ్డం. బోర్లు ఎయ్యనికి పుస్తెలు కూడా అమ్ముకున్నం. కేసీఆర్ సారు అచ్చినంక నీళ్లకు రందీ లేకుండా పోయిందని నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామానికి చెందిన మహిళా రైతు గంగ నర్సు అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మోర్తాడ్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ఆ వృద్ధురాలు తన అనుభవాన్ని వివరించారు. ‘అప్పట్ల ఎవుసం జేసేటోళ్ల బతుకు దీనంగా ఉండె. బోర్లు ఏసి ఏసి అప్పుల పాలయినం. కేసీఆర్ సారు అచ్చినంక నీళ్ల గోస పోయింది. సెర్లు నింపుతుండ్రు. కాల్వల్ల నీళ్లు అస్తున్నయి. యాట రెండు పంటలు పండుతున్నయి. మునుపు రోడ్లు సరిగ ఉండక పోయేటివి. బురదలవోయేటోళ్లం. ఇప్పుడు ఎటుజూసిన రోడ్లు అయినయి. మస్తు సౌలత్ అయింది. ఊరూర్కి రోడ్డువడ్డది. కేసీఆర్ సారులెక్క, ప్రశాంత్రెడ్డి సారు లెక్కగిట్ల పనులు జేసేటోళ్లు ఉంటే అందరు మంచిగుంటరు’ గంగనర్సు పేర్కొన్నారు.
గ్యాస్ ధర పెంచి పేదోళ్ల ఉసురు పోసుకున్న పాపం బీజేపీదే. రూ.1,200 కట్టలేక కట్టెలపొయ్యిల మీద వంట చేసుకుంటున్నా. ఎమ్మెల్యే రూ.650కే ఇంటింటికి పైపు ద్వారా గ్యాస్ అందిస్తానని చెప్పడంతో ధైర్యం వచ్చింది. కేసీఆర్ ఇస్తున్న పింఛన్లో రూ.1200 గ్యాస్ సిలండరికే కట్టుడు అయితాంది. బీజేపీని రానీయకుండా కేసీఆర్ను గెలిపించాలి.
– గట్టమల్లు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, గొల్లపల్లి